యాదగిరిగుట్ట: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వంద గుడిసెలకు పైగా కాలి బూడిదయ్యాయి. యాదగిరిగుట్టలో సాయిపవన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ కంపెనీలో పనిచేస్తున్న పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశాకు చెందిన కూలీలు పనులు జరిగే సమీపంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం కూలీలు పనిలోకి వెళ్లగా ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు సమీపంలో ఉన్న వందకుపైగా గుడిసెలకు వ్యాపించాయి.
అప్రమత్తమైన కూలీలు మంటలను కంపెనీ వాహనాల సహాయంతో నీళ్లు తెచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.