వాట్సాప్‌లో ట్రిపుల్‌ తలాఖ్‌ 

21 Dec, 2018 00:46 IST|Sakshi
పాఠశాల ముందు సోదరుడు ఆదిల్‌తో కలసి ధర్నా చేస్తున్న సుమయ్యబాను  

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన  

న్యాయం కోసం ధర్నాకు దిగిన బాధితురాలు  

హైదరాబాద్‌: అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని ఓ మాస్టారు వాట్సాప్‌ కాల్‌లో ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పిన ఉదంతమిది. కాళ్లవేళ్ల పడి బతిమిలాడినా భర్త వినకపోవడంతో పాఠశాల ముందు బాధితురాలు «ధర్నాకు పూనుకుంది. వివరాలు... హైదరాబాద్‌ టోలీచౌకీ ఎండీ లైన్స్‌లో నివాసముండే మొహమ్మద్‌ ముజామిల్‌ (29), యూసుఫ్‌గూడకు చెందిన సుమయ్యబాను దంపతులు. గతేడాది జనవరి 6న వీరి వివాహం జరిగింది. వివాహ సమయంలో 10 లక్షల కట్నకానుకలు ముట్టజెప్పారు.  

అదనపు కట్నం కోసం వేధింపులు..
వివాహం జరిగిన నెల తర్వాత సుమయ్యబానును అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. భర్త కూడా తల్లిదండ్రులకు వత్తాసు పలుకుతూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. గతేడాది ఫిబ్రవరి 20న ముజామిల్‌ దంపతులకు కుమార్తె జన్మించింది.

ఇంటికి వెళితే దాడులు..
సెప్టెంబర్‌లో ఆమె తన పాపతో కలసి టోలిచౌకీలోని అత్తారింటికి వెళ్లింది. అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని సూటిపోటీ మాటలనేవారు. కడుపు నిండా తిననివ్వకుండా ఆమె మీద భౌతికంగా దాడి చేయసాగారు. పాలు అందక పాప ఆరోగ్యం క్షీణించడంతో ఆమె తల్లిదండ్రులు నవంబర్‌ 11న వచ్చి తల్లిపిల్లను తీసుకెళ్లి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. 

ట్రిపుల్‌ తలాఖ్‌ అంటూ విడాకులు..
భర్త, అత్తామామలు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరిది కూడా కట్నంకోసం వేధిస్తుండటంతో నవంబర్‌ 23న బాధితురాలు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో భర్త, అత్తమామ, మరిదిలపై కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన ముజామిల్‌ నవంబర్‌ 28న ఆమెకు వాట్సాప్‌ కాల్‌ చేసి ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పాడు.  

పాపను చూసిన పాపాన పోలేదు: సుమయ్యబాను  
న్యాయం కావాలంటూ బాధితురాలు సుమయ్యబాను తన భర్త నిర్వహిస్తున్న పాఠశాల వద్ద సోదరుడు ఆదిల్‌ఖాన్‌తో కలసి ధర్నా చేసింది. అత్తింటివారు ఏనాడూ తన పాపను చూసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పిన తన భర్తలో మార్పు వస్తుందనే ఆశతో రోజూ ఫోన్‌ చేసి ప్రా«ధేయపడ్డానని చెప్పింది. తన భర్తకు వేరొకరితో ఉన్న అక్రమ సంబంధం గురించి నిలదీసిన నాటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె తెలిపింది. 


 

మరిన్ని వార్తలు