మెట్రో రైలుకు తప్పిన ప్రమాదం

27 Jul, 2019 15:23 IST|Sakshi

హైదరాబాద్‌ : నగరంలో మెట్రో రైలుకు శనివారం తృటిలో ప్రమాదం తప్పినట్లు వచ్చిన వార్తలను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఖండించారు.  వివరాల్లోకి వెళితే.. మియాపూర్‌-ఎల్బీనగర్‌ మార్గంలో వెళ్లాల్సిన మెట్రో రైలు పొరపాటున మరో ట్రాక్‌లోకి  వెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలపై ఎన్వీఎస్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ఇవాళ మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా ఈదురు గాలుల ధాటికి ట్రాక్‌పై రాడ్‌ పడిపోవడంతో ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వైపు వెళ్తున్న రైలు అసెంబ్లీ స్టేషన్‌ దాటి లక్డికాపూల్‌ వద్దకు రాగానే నిలిచిపోయింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

ఈ సందర్భంగా రైలులో ఉన్న ఓ ఆస్తమా పేషెంట్‌ స్వల్ప అస‍్వస్థతకు గురి కావడంతో, తోటి ప్రయాణికులు ఈ సమాచారాన్ని సిబ్బందికి తెలిపారు. దీంతో బ్యాటరీ పవర్‌ సాయంతో రైలును రివర్స్‌ తీసుకువెళ్లి అసెంబ్లీ స్టేషన్‌లో నిలిపారు. అయితే రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో రైలు వేరే ట్రాక్‌లోకి వెళ్లిందంటూ పలువురు ప్రయాణికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో  మెట్రో రైలుకు తప్పిన ముప్పు అంటూ వదంతులు వ్యాపించాయి. ప్రస్తుతం మెట్రో రైలు సేవలు యథాతథంగా నడుస్తున్నాయి.

ప్రమాద వార్తను ఖండించిన మెట్రో రైలు ఎండీ
కాగా మెట్రో రైలు ప్రమాద ఘటనపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. రాంగ్‌ రూట్‌లో మెట్రో రైలు వెళ్లిన వార్తలను ఆయన ఖండించారు. మరమ్మతుల కోసమే అరగంట పాటు మెట్రో సేవలలో ఇబ్బందులు తలెత్తినట్లు ఓ ప్రకటన చేశారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దంటూ సూచించారు. ‘వాస్తవాలు తెలియకుండా ఈ రకమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దు. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ గాలి పీడనం కారణంగా అసెంబ్లీ స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై మెరుపు అరెస్టర్ రాడ్ పడింది. ముందు జాగ్రత్త చర్యగా, ఓవర్ హెడ్ ఎలెక్ట్రికల్ పవర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. అలాగే పడిపోయిన రాడ్ తొలగించాం. రైలుకు ఓహెచ్‌ఈ (OHE) శక్తి లేకపోవడం, అది బ్యాటరీతో నడిచింది. మెట్రో రైలులో ఆస్తమాతో బాధపడుతున్నో  ప్రయాణీకుడు ఫిర్యాదు చేయడంతో....ప్రయాణీకులను అసెంబ్లీ స్టేషన్ నుండి కొన్ని మీటర్ల దూరంలో ఖాళీ చేసి ప్లాట్‌ఫామ్‌కు తీసుకువెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా అరగంటపాటు మెట్రో సేవలను నిలిపివేయడం అయింది’  అని తెలిపారు.

చదవండి: పట్టాలపై నిలిచిపోయిన మెట్రో

మరిన్ని వార్తలు