పాత అభ్యర్థుల మధ్యే పోటీ

26 Nov, 2018 14:15 IST|Sakshi
బరిలో హరిప్రియ, కనకయ్య, అబ్బయ్య, నర్సయ్య

సాక్షి, ఇల్లెందు: నియోజకవర్గంలో మళ్లీ నలుగురు పాత అభ్యర్థుల మధ్యే పోటీ సాగుతోంది. ఐదు దఫాలు గెలిచి మూడు దఫాలు ఓడిపోయిన గుమ్మడి నర్సయ్య, మూడు దఫాలు గెలిచి నాలుగు దఫాలు ఓడిపోయిన ఊకె అబ్బయ్య, రెండు దఫాలు ఓడిపోయి ఒక దఫా గెలిచిన కనకయ్య, గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన హరిప్రియ మధ్య పోటీలో నిలిచారు. ఈ దఫా 16 మంది బరిలో ఉండగా ఈ నలుగురుతో పాటు బీజేపీ కూడా పోటీ పడుతోంది. నెల రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రజాకూటమి తరుపున కాంగ్రెస్‌ అభ్యర్థి హరిప్రియ, బీజేపీ తరుపున మోకాళ్ల నాగస్రవంతి పోటీ చేస్తున్నారు.  చివరి వరకు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించిన రెబెల్‌ అభ్యర్థి ఊకె అబ్బయ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధానంగా పోటీలో ఈ నలుగురు మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది.   
ప్రచారంలో ఎవరికివారు.. 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోరం కనకయ్య నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేయడంతోపాటు ఇంటింటి ప్రచారం చేశారు. నెల రోజుల నుంచి  కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ జత కట్టడంతో బలమైన కూటమిగా మారనుంది. సహజంగానే కాంగ్రెస్‌కు అత్యధిక ఓటు బ్యాంకు ఉంది. టీడీపీ, సీపీఐ జత కావడంతో బలంగా మారే అవకాశం ఉంది. ఎన్డీ రాయల వర్గం గుమ్మడి నర్సయ్యను, చంద్రన్న వర్గం యదళ్లపల్లి సత్యంను మరోమారు తమ అభ్యర్థులుగా  ప్రకటించుకుని ప్రచారం ముమ్మరం చేశారు.     
అగ్రనేతల రాక కోసం ఎదురు చూపు..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్ర నేతలను రప్పించి ప్రచారం నిర్వహించుకునే ఏర్పాట్లు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర నేతలను, కాంగ్రెస్‌ రేవంత్‌రెడ్డిని దించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ మాత్రం అమిత్‌షా, మురళీధర్‌రావును దించి ప్రచారం చేయాలని భావిస్తోంది. ఎన్డీ బహిరంగ సభను నిర్వహించి తమ విధానాలను ప్రజలకు వివరించే యత్నంలో ఉంది. 
జిల్లాల విభజన తర్వాత.
జిల్లాల విభజన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి చేరింది.  కామేపల్లి మండలం ఖమ్మంలో, గార్ల, బయ్యారం మహబూబాబాద్‌ జిల్లాలో ఇల్లెందు, టేకులపల్లి మండలాలు, ఇల్లెందు మున్సిపాల్టీ భద్రాద్రి జిల్లాలో ఉంది.  ప్రస్తుతం ఇల్లెందు, గార్ల, బయ్యారం, కామేపల్లి, టేకులపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీతో సాగుతున్న నియోజకవర్గంలో 1,96,798 మంది ఓటర్లు ఉండగా ఇందులో 97,552 మంది పురుషులు, 99,230 స్త్రీలు, 16 ఇతరులు మంది ఉన్నారు. నియోజకవర్గంలో 230 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పాత కాపుల మధ్య పోరు ఎవరి వైపునకు మొగ్గుతుందో వేచి చూడాల్సి ఉంది.  

మరిన్ని వార్తాలు... 

మరిన్ని వార్తలు