సర్కారీ స్కూళ్లపై సమ్మె ఎఫెక్ట్‌!

10 Nov, 2019 03:22 IST|Sakshi

తగ్గిన విద్యార్థులు, టీచర్ల హాజరు శాతం

పరీక్షల సమయంలో 87% విద్యార్థులు హాజరు

ఆ తర్వాత 77 శాతానికి తగ్గుదల..

ఇటు టీచర్ల హాజరు  8 శాతం తగ్గుదల

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, టీచర్లపైనా పడుతోంది. దీంతో హాజరు తగ్గుతోంది. గత నెలలో నిర్వహించిన సమ్మేటివ్‌ అసేస్‌మెంట్‌–1 (ఎస్‌ఏ) పరీక్షల సమయంలో విద్యార్థులు, టీచర్ల హాజరు, ఈనెలలో ఇప్పటివరకు వారి హాజరు తీరుపై విద్యాశాఖ లెక్కలు తేలి్చంది. దీంతో 10 శాతం వరకు విద్యార్థుల హాజరులో, 8 శాతం వరకు టీచర్ల హాజరులో తేడా ఉన్నట్లుగా గుర్తించింది. ఆర్టీసీ సమ్మె కారణంగానే విద్యార్థులు, టీచర్ల హాజరు తగ్గినట్లు విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. విద్యాశాఖ ఇటీవల విద్యార్థులు, టీచర్ల హాజరును ఆన్‌లైన్‌లో సేకరించేందుకు టీ–హాజరు పేరుతో మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచి్చంది. దానికి విద్యార్థులు, టీచర్లకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగిన యూ–డైస్‌ డాటాను అనుసంధానం చేసింది.

పాఠశాలల హెడ్‌మాస్టర్లు/హాజరు బాధ్యత చూసేందుకు విద్యాశాఖ ఎంపిక చేసిన ఉపాధ్యాయులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని బయోమెట్రిక్‌ ఆధారితంగా టీచర్లు విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. మొదట్లో చాలా పాఠశాలలు ఈ యాప్‌ ద్వారా హాజరును నమోదు చేయలేదు. ఆ తర్వాత విద్యాశాఖ స్పçష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలోని 28,791 ప్రభుత్వ పాఠశాలు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసు కొని హాజరు నమోదును ఆన్‌లైన్‌లో పంపిస్తున్నాయి.  20 లక్షలకు పైగా విద్యార్థులు, లక్షకు పైగా టీచర్ల హాజరు శాతా న్ని సేకరించి పోల్చి చూసింది. గత నెల 25 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన ఎస్‌ఏ–1 పరీక్షల సమయంలో టీచర్లు విద్యార్థుల హాజరును పరిశీలించింది.

ఈనెల 2 నుంచి గురువారం వరకు విద్యార్థులు, టీచర్ల హాజరును పరిశీలించింది. దీంతో పరీక్షల సమయంలో హాజరు బాగానే ఉన్నా.. ఆ తర్వాత తగ్గిపోయినట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తిం చింది. సమ్మె ప్రభావంతో పరీక్షల సమయంలో హాజరైన విద్యార్థుల సంఖ్య కంటే ఆ తర్వాత హాజరైన వారి సంఖ్యలో 10% వరకు తగ్గుదలను అధికారులు గుర్తించారు. పరీక్షలకు హాజరు కావాలి కాబట్టి విద్యార్థులు, టీచర్లు ఏదో ఒక రవాణా సదుపాయాన్ని చూసుకొని పరీక్షలకు హాజరయ్యారని, ఆ తర్వాత మళ్లీ తగ్గారని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో విద్యార్థుల హాజరు 87% నుంచి 77 శాతానికి తగ్గగా, టీచర్ల హాజరు 88 % నుంచి 80 శాతానికి తగ్గినట్లు తేలింది.

మరిన్ని వార్తలు