తప్పుడు తూకాలపై తనిఖీలు

26 Jan, 2018 01:44 IST|Sakshi

తూనికలు, కొలతల శాఖ రీజినల్‌ డిప్యూటీ కంట్రోలర్‌ శ్రీనివాస్‌

సాక్షి, హైదరాబాద్‌: తప్పుడు తూనికలు, కొలతలు వాడుతున్న వ్యాపారులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కేసులు పెట్టి పెనాల్టీలను వసూలు చేస్తున్నామని తూనికలు, కొలతల శాఖ హైదరాబాద్‌ రీజియన్‌ రీజినల్‌ డిప్యూటీ కంట్రోలర్‌ వి.శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం ‘సాక్షి’లో ‘తూచేస్తున్నారా.. దోచేస్తున్నారా..?’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. సూపర్‌మార్కెట్, కిరాణా దుకాణాల్లో కాంటాలు ఏడాదికి ఒకసారి విధిగా సరిచూసి ముద్రవేస్తామని చెప్పారు.

తూకం పరికరంపై ముద్ర వేయకుండా వినియోగిస్తే గుర్తించి కేసులు పెడుతున్నట్లు చెప్పారు. తూనికలు, కొలతలు వాడుతున్న ప్రతి దుకాణదారుడు విధిగా  ఒక సెట్‌ తూనికలు దుకాణ ప్రాంగణంలో పెట్టాలని, కొనుగోలుదారుడికి అనుమానం వస్తే ఆ దుకాణదారుడి ప్రాంగణంలో గల తూనికలపై ఆ వెయిట్స్‌ పెట్టి సరిగా ఉందో లేదో నిర్ధారించుకోవచ్చన్నారు. 

ఒకవేళ ఎవరైనా దుకాణాదారుడు నిర్థారిత వెయిట్స్‌ని ఆయా ప్రాంగణాల్లో ఉంచకపోతే దానిపై అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. వ్యాపారులపై నిఘా పెంచడానికి ప్రతి వారంలో రెండు రోజులు ప్రత్యేక క్షేత్ర తనిఖీలు చేస్తున్నామని, ఏదైనా ప్రత్యేక ఫిర్యాదు వస్తే హైదరాబాద్‌లోని ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఘటనాస్థలికి పంపి తనిఖీ లు నిర్వహిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు