అధికారంలోకి తెచ్చే మందులు నా వద్ద ఉన్నాయి: జగ్గారెడ్డి

15 Nov, 2019 04:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చే మందులు తన వద్ద ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్, బీజేపీల బలాలు, బలహీన తలు తనకు తెలుసని, ఆ పార్టీలను నియంత్రించగల నైపుణ్యం తన వద్ద ఉందని చెప్పారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సోనియా, రాహుల్‌గాంధీ అడుగుజాడల్లో పనిచేస్తానని, ఎలాంటి పదవిని ఆశించకుండా పార్టీని నడిపిస్తానన్నారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మారిస్తే తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మొదటి నుంచీ అడుగుతున్నానని చెప్పారు. ఈ మేరకు పార్టీ చీఫ్‌ సోనియాతోపాటు రాహుల్‌గాంధీ, ప్రియాంక, కుంతియా, అహ్మద్‌పటేల్, గులాంనబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్‌లకు తన దరఖాస్తును రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపినట్లు తెలిపారు. త్వరలోనే సోనియా, రాహుల్‌లను వ్యక్తిగతంగా కలసి అధ్యక్ష పదవి కోరుతానని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటేనే ప్రజాసమస్యల పరిష్కారం సాధ్యమన్న జగ్గారెడ్డి.. ఏదైనా సమస్య ఉంటే సీఎం కేసీఆర్‌ను నిలదీసే శక్తి టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉందా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు