హైదరాబాద్: యూపీలో కుల రాజకీయాలు చేసిన పార్టీకి ఏ గతి పట్టిందో ఇక్కడ కూడా అదే గతి పడుతుందని టీఆర్ఎస్ నుద్ధేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. కుల, మత రాజకీయాలను పక్కన పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చెయ్యాలని, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు చేస్తే.. గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని అన్నారు.
ముస్లిం జనాభాను బీసీల్లో చేరిస్తే బీసీలు అంతా తిరగబడతారని హెచ్చరించారు. తెరాస ప్రభుత్వ ఏక పక్ష ఒంటెద్దు పోకడలను ప్రజల్లో ఎండగడతామన్నారు. అసెంబ్లీ లోపల బయట పోలీసులతో ప్రభుత్వం నడపాలని చూస్తే తగిన శాస్తి జరుగుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసనగా.. రేపు అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరకంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనేని చెప్పారు.