ఫస్ట్‌ ఆదిలాబాద్‌కే వస్తా..

23 Nov, 2018 09:21 IST|Sakshi
ఇచ్చోడలో సభకు హాజరైన ప్రజలు

సాక్షి, ఆదిలాబాద్‌: ‘ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదట ఉమ్మడి ఆది లాబాద్‌ జిల్లాకే వస్తా.. ఈడనే నాలుగు రోజులుం ట.. సీఎస్‌ నుంచి మొదలుకుని అధికారులంతా ఇక్కడనే ఉంటరు. గిరిజనుల సమస్యలతో పాటు ఇక్కడి సమస్యలన్నింటినీ పరిష్కరిస్త..’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాలో గురువారం నిర్వహించిన నా లుగు ప్రజాఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నా రు. ముందుగా ఖానాపూర్‌ సభకు హాజరైన ఆయ న అక్కడినుంచి వరుసగా ఇచ్చోడ, నిర్మల్, భైంసా సభలలో పాల్గొన్నారు. ప్రతిచోటా అరగంట లోపు మాత్రమే ప్రసంగించారు. మధ్యాహ్నం 12గంటలకు జిల్లాకు వచ్చిన సీఎం 4గంటలకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ వెళ్లిపోయారు.

సుడిగాలి పర్యటనతో నాలుగు నియోజకవర్గాల ప్రజలను కలిసి వెళ్లారు. నాలుగు సభల్లోనూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు వస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడే నాలుగు రోజులు ఉంటానన్నారు. స్థానికంగా గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధికి రూపకల్పన చేస్తానన్నారు.  రైతులందరికీ గిట్టుబాటు ధర అందించేలా కొత్త వ్యూహం చేస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటలను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయిస్తామన్నారు. అనంతరం రేషన్‌ డీలర్ల ద్వారా ప్రజలకు కల్తీ లేని పదార్థాలను అందించేందుకు ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని బీడీ కార్మికులకు శుభవార్త వినిపించారు.

కటాఫ్‌ తేదీని   ఎత్తివేసి, బీడీలు చేసే కార్మికులందరికీ పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్మూర్‌–నిర్మల్‌–ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌కు రాష్ట్రవాటాను అందిస్తామని, నిర్మల్‌లో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్మల్‌ జిల్లా కేంద్రాన్ని గజ్వేల్‌తో పాటు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తామని, పట్టణంతో పాటు చుట్టూ పల్లెల్లోనూ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. స్వర్ణ ప్రాజెక్టు కింద మిగతా తొమ్మిది చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో గిరిజనుల భూములకు పట్టాలు ఇస్తామన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు రైతుబంధు వచ్చేలా చూస్తామన్నారు. ఈ సమస్య ఆదిలాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్‌ జిల్లా ములుగు, నిజామాబాద్‌ వంటి ప్రాంతాల్లో ఉందన్నారు. దీన్ని పరిష్కరించి లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. బాసర అమ్మవారి ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిశ్రమలు, మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు సభల్లోనూ జనాదరణను చూసి.. ఇక గెలుపు ఖాయమైందని కేసీఆర్‌ జోస్యం చెప్పారు. ఆయా సభల్లో స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై మాట్లాడారు.

ఖానాపూర్‌ సభలో..
ఖానాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌ సైతం చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఖానాపూర్, కడెం మండలాల రైతుల చిరకాల కోరిక సదర్‌మాట్‌ బ్యారేజీపై గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగా నే రూ.500 కోట్లతో సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మా ణం ప్రారంభించిందన్నారు. ప్రాజెక్టు కాలువ నిర్మాణం పూర్తి కాగానే ఖానాపూర్‌ వచ్చి తానే కొబ్బరికాయ కొడుతానన్నారు. కాళేశ్వరం ద్వారా వచ్చే నీటిలో ఇక్కడి ఆయకట్టుకు కూడా వాటా ఉంటుందని అన్నారు. విద్యావంతురాలు, పట్టుదల కలిగిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్‌ను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

ఇచ్చోడలో..
తెలంగాణలో చంద్రబాబు పీడ ఇంకా ఉందని, అది పోవాలంటే కాంగ్రెస్‌ను ఓడించి తగిన గుణ పాఠం చెప్పాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవన్నారు. అసలే కరెంటు లేకుండా చేస్తారన్నారు. ఇక్కడి గిరిజనులు, గిరిజనేతరుల సమస్యలను తాము అధికారంలోకి వచ్చిన ఆరునెలలోనే పరి ష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క బోథ్‌ ని యోజకవర్గంలోనే 115 కొత్త పంచాయతీలను ఏర్పా టు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుదన్నా రు.

గిరిజన, మైనార్టీల రిజర్వేషన్ల కోసం తాము పకడ్బందీగా ప్రతిపాదిస్తే.. కేంద్రం తిరస్కరించింద ని ఆరోపించారు. పట్టువదలకుండా రిజర్వేషన్ల ను సాధించి తీరుతామన్నారు. బోథ్‌ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టును మంజూరు చేశామన్నారు. తాంసి మండలంలో గోముత్రి, పిప్పల్‌కోటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఇ క్కడి అభివృద్ధి పనులను చూసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాథోడ్‌ బాపురావును మళ్లీగెలిపించాలని కోరారు.

నిర్మల్‌ సభలో..
నిర్మల్‌ నియోజకవర్గం మీదుగా రైల్వేలైన్‌ రప్పిస్తామని, ఇక్కడ మెడికల్‌ కాలేజీ సైతం వస్తుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. జిల్లాగా ఏర్పడ్డ నిర్మల్‌లో పరిశ్రమలనూ ఏర్పాటు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్యాకేజీలో లక్ష 20వేల ఎకరాలకు నియోజకవర్గంలో నీళ్లు అందుతాయన్నారు. నియోజకవర్గంలో మొత్తం 66,829 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారని, వారు ఓట్లు వేసినా ఇంద్రకరణ్‌రెడ్డి గెలుస్తారని చెప్పారు. ఇక్కడి ఎమ్మెల్యేనే కాదు.. ఆయన రాష్ట్రానికి మంత్రి అని, ఆయన హయాంలో గోదావరి, కృష్ణా పుష్కరాలను ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా పూర్తి చేశామని అన్నారు.

తన మంత్రిత్వ శాఖలను ఇంద్రకరణ్‌రెడ్డి సమర్థవంతంగా నిర్వహించారన్నారు. నిర్మ ల్‌ జిల్లా ఏర్పాటును పట్టుబట్టి సాధించుకున్నారని, జోగు రామన్నతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగు జిల్లాలు అయ్యేలా చేశారని వివరించారు. ఆయన కోరినట్లుగా నిర్మల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని, గజ్వేల్‌తో పాటు నిర్మల్‌నూ పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు.  తాము చేసిన అభివృద్ధి నిజమైతే ఆయనను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.

భైంసా సభలో..
రాష్ట్రంలో యాదాద్రితోపాటు అన్ని దేవాలయాలు అభివృద్ధి జరిగాయని, ఎన్నోసార్లు అనుకున్నా.. బాసర ఆలయానికి రాలేకపోయానని కేసీఆర్‌ అ న్నారు. మళ్లీ గెలిచాక త్వరలోనే బాసరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తానన్నారు. తమ పార్టీకి ప్రజలే అధిష్టానం అని, వారు సూచించిన విధంగానే న డుచుకుంటామని వెల్లడించారు. ముథోల్‌ ఎమ్మె ల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డి కోరిన విధంగా బీడీ కార్మికులకు జీవనభృతి కటాఫ్‌ తేదీని పొడిగిస్తామన్నా రు.

2018 వరకు పీఎఫ్‌ కలిగి ఉన్న కార్మికులందరికీ అధికారంలోకి వచ్చిన తెల్లారే జీవనభృతి కిం ద ప్రభుత్వ సాయం అందిస్తామని హామీ ఇచ్చా రు. నియోజకవర్గంలో ఏం కావాలన్నా.. గోస, గో స ముఖం పెట్టి అడుగుతారని, పని కోసం పట్టుబట్టి పక్క ఎమ్మెల్యేలను సైతం తీసుకొచ్చి చేయిం చుకుంటారని చెప్పారు. గోదావరి నదిపై పంచగుడి వద్ద వంతెన కోసం ఆర్మూర్‌ ఎమ్మెల్యేను తీసుకొచ్చి మరీ నిధులు మంజూరు చేయించుకున్నారన్నారు. 

ఓవైసీని నిర్మల్‌ రానివ్వకుండా..
తమతో మితృత్వం ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ నిర్మల్‌ సభకు రాకుండా ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు దగుల్బాజీ రాజకీయాలు చేశారని కేసీఆర్‌ విమర్శించారు. భైంసా, నిర్మల్‌లలో ముస్లింలంతా ఆలోచిస్తారని, వారంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని అన్నారు. ఎంఐఎంతో తాము కలిసి పనిచేస్తామని ఉర్దూలో ప్రసంగించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పక్కనే మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ధర్మాబాద్‌ తాలూకాలోని 40 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలుపాలంటూ వచ్చారన్నారు. ఆయా సభలలో ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, రాథోడ్‌ బాపురావు, గడ్డిగారి విఠల్‌రెడ్డి కేసీఆర్‌ మాట్లాడుతున్నంత సేపు ఆయన పక్కనే ఉన్నారు.

బహిరంగ సభల్లో ఎంపీ గోడం నగేశ్, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, గోవింద్‌నాయక్, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రంగినేని మనీష, పార్టీ రాష్ట్ర నాయకులు దేశపతి శ్రీనివాస్, కూచాడి శ్రీహరిరావు, వి.సత్యనారాయణగౌడ్, పైడిపెల్లి రవీందర్‌రావు, డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, వాహీద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు