కరోనా 98 శాతం నయమవుతుంది
ప్రత్యేక టాస్క్ ఫోర్స్టీం ఏర్పాటు
24 గంటలు వైద్య సదుపాయం కల్పిస్తాం
జిల్లాలో ఒక్కరికి కూడా లక్షణాలు కనిపించలేదు
సాక్షి, నిజామాబాద్అర్బన్: కరోనా (కోవిడ్–19) పై అప్రమత్తంగా ఉన్నట్లు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరిన్టెండెంట్ డాక్టర్ నాగేశ్వర్రావు తెలిపారు. బుధవారం ‘సాక్షి’తో ఇంటర్వ్యూలో పలు విషయాలు వెళ్లడించారు. జిల్లాలో వ్యాధి ప్రభావం అంతగా ఉండబోదని ఒకవేళ వ్యాధి లక్షణాలు బయటపడినా మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యుల బృందంతో టాస్క్పోర్స్టీం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
- ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేశాం. జనరల్ ఫిజీషియన్, ఉపిరి తిత్తుల వైద్యుడు, చాతి నిపుణుల వంటి వారితో ప్రత్యేకంగా టాస్క్పోర్స్ టీం ఏర్పాటు చేశాం. పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారు. 24 గంటలు వైద్య సదుపాయాలు అందిస్తాం. ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు 20 పడకలతో అందుబాటులో ఉంది.
- ప్రస్తుతం ఆస్పత్రిలో సపోర్టు మందులు అందుబాటులో ఉన్నాయి.వ్యాధికి సంబంధించి లక్షణాలు స్పష్టంగా ఉన్నట్లయితే తాత్కాలిక చికిత్స కోసం సపోర్టు మందులు ఉపయోగించాలి. ఆక్సిజన్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. జలుబు, దగ్గు జ్వరం వంటి లక్షణాలు ఉంటే మొదట పరిశీలించి కరోనాకు చెందిన లక్షణాలు ఉన్నాయా..? పరీక్షిస్తాం. మన వాతావరణంలో కరోనా వైరస్ ప్రబలడానికి వీలులేదు. ఇక్కడ కొత్తగా వ్యాధిరాదు. విదేశాలనుంచి వచ్చిన వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది. 98 శాతం వ్యాధి నయం అవుతుంది కేవలం 2శాతం మాత్రమో వ్యాధి రిస్క్గా ఉంటుంది. ప్రజలు భయపడాల్సిన అవసరంలేదు.
- ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నిత్యం రెండువేల మంది రోగులు, వారి బంధువుల తాకిడి ఉంటుంది. ఆయా విభాగాల్లో రోగులు ఉంటారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకకుండా అవగాహన కల్పిస్తున్నాం. కరపత్రాలు వార్డుల్లో అందుబాటులో ఉంచుతున్నాం. వైద్యుల ద్వారా రోగులకు తెలియజేస్తున్నాం. ఆస్పత్రిలో కరోన ప్రబలే అవకాశం తక్కువగా ఉంది. ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఆస్పత్రి వెనుక భాగంలో ఉంది కాబట్టి ఇతర రోగులు వారి బంధువులకు ఇబ్బంది లేదు.
- అవుట్ పేషెంట్ , ఇన్ పేషెంట్ విభాగాల్లో రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. కాని ఇంత వరకు కరోనా లక్షణలతో కూడిన వారు ఎవరు రాలేదు.
- ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ని«ధుల మంజూరు కాలేదు. ఉన్న నిధులతో సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు అదనపు నిధుల అవసరం కూడ లేదు. కరపత్రాల ద్వారా ప్రచారం కరోన వైరస్ పై ప్రచారం చేస్తున్నారు.
- ఒకవేళ వ్యాధి లక్షణాలు ఉన్న రోగి వస్తే తక్షణమే హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్ను అందుబాటులో ఉంచాం. ప్రత్యేక వైద్యసిబ్బంది, వారికి సూట్లు కూడ అందుబాటులో ఉన్నాయి.
- ఎక్కువ మొత్తంలో రోగులు వస్తే కూడ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వైద్యులుకూడ అందుబాటులో ఉన్నారు. మరో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుత వాతావరణంలో కరోన వైరస్ ప్రబలే అవకాశం మన వద్ద లేదు.