‘అపెక్స్‌’లోనే తేల్చుదాం!

1 Sep, 2018 02:06 IST|Sakshi

 ప్రాజెక్టుల నియంత్రణపై తేల్చిచెప్పిన పార్లమెంటరీ స్థాయీసంఘం

 టెలీమెట్రీపై జరగని చర్చ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌ కోర్టులోకి నెట్టింది. కృష్ణాబోర్డు ఇప్పటికే తయారు చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న దృష్ట్యా, దీన్ని కేంద్ర జల వనరులశాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో చర్చించి తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించింది.  కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో ఉన్న సమస్యలపై గురువారం హోంశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం బోర్డు అధికారులతో చర్చించింది. ఈ భేటీలో బోర్డు సిద్ధంచేసిన వర్కింగ్‌ మాన్యువల్‌ను సంఘానికి అందించారు.

ప్రాజెక్టుల నియంత్రణ తమ పరిధిలో లేనందున శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని, తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని బోర్డు అధికారులు స్థాయీ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ దృష్ట్యా ప్రాజెక్టుల నియంత్రణను తమకు అప్పగించాలని కోరడంతో పాటుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో భేటీ జరిపి తుది నిర్ణయం చేద్దామని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇక టెలీమెట్రీ అంశంపైనా ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని బోర్డు వర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు