స్థానికేతర ఉద్యోగులు 1300 పైనే!

27 May, 2014 02:28 IST|Sakshi
స్థానికేతర ఉద్యోగులు 1300 పైనే!

- ఇప్పటికే 350 మంది సీమాంధ్రుల గుర్తింపు
- సింగరేణి అధికారుల్లో 90శాతం మంది వారే..
- పోలీస్, విద్య, యూనివర్సిటీలో సింహభాగం
- వివరాలు సేకరిస్తున్న టీఎన్‌జీవోలు
- బోగస్ సర్టిఫికెట్లపైనా నజర్

 
తెలంగాణ ఆవిర్భావ దినం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ‘లోకల్’ లొల్లి మొదలైంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రాంత ఉద్యోగులే  జిల్లాలో పనిచేసే దిశగా సన్నాహాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగులను సీమాంధ్రకు పంపించాలని నిర్ణయించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ మేరకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలోనూ వివిధ ప్రభుత్వ శాఖల్లో 1300కు పైగా మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఈ మేరకు సంబంధిత ఉద్యోగుల వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యాయి.
 
సాక్షి, కరీంనగర్ : ఈ నెల 24న కరీంనగర్ వచ్చిన టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్.. జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి టీఆర్‌ఎస్ వార్‌రూమ్, టీఎన్‌జీవో గ్రీవెన్స్‌సెల్‌కు సమాచారం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలకు సూచించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలుగో తరగతి నుం చి పదో తరగతి వరకు తెలంగాణలో విద్యాభ్యాసం చేసిన సీమాంధ్రులకు స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. వారికి మాత్రమే స్థానికేతర సమస్య నుంచి మినహాయింపు ఉంది.

వివరాల సేకరణలో నిమగ్నం
జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించడంలో టీఎన్‌జీవోలు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా  వెబ్‌సైట్ రూపొందించారు. జిల్లాలో 72 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వీటిలో ఉన్న త, ప్రాథమిక విద్య, పోలీసుశాఖలు మినహాయించి ఇప్పటివరకు 27 శాఖల నుంచి సమాచారం సేకరిం చారు. 350 మంది సీమాంధ్రులు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. ఇంకా 45 శాఖల నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని వదలకుండా అందరి సమాచారం సేకరించాలని టీ ఎన్‌జీవో జిల్లాశాఖ అన్ని శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులకు సూచించింది.

ఆ మూడు శాఖల్లో ఎక్కువ
పోలీస్, విద్య, యూనివర్సిటీ లో సింహభాగం మంది సీమాంధ్ర ఉద్యోగులున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 14,400 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో నాలుగు వందలకు పైగా సీమాంధ్రులున్నారు. డీఎస్సీల్లో 80 శాతం రిజర్వేషన్, 20 శాతం ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. 1994 డీఎస్సీ నుంచి 2000 డీఎస్సీ వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 70 శాతం రిజర్వేషన్, 30 శాతం ఓపెన్ కేటగిరీల్లో ఉద్యోగాలి చ్చారు. దీంతో అదనపు కోటా కింద జిల్లాలో 130 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు పొందారు.

వీరందరు గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచే ఉన్నారు. 2000 మేలో టీడీపీ అధినేత చంద్రబాబు సచివాలయ బదిలీలకు తెరలేపారు. అక్రమ బదిలీలతో 40 మంది కి పైగా ఉపాధ్యాయులు జిల్లాలో వివిధ పాఠశాలల్లో తిష్టవేశారు. వీరితోపాటు ఓపెన్ కేటగిరీ లో ఉద్యోగాలు సాధించిన వారందరూ జిల్లా నుంచి వెళ్లిపోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 31 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోలీసు, యూనివర్సిటీలో వందలాది మంది సీమాంధ్రులున్నారు. వీరందరి వివరాలు సేకరిస్తే.. వందలాది పోస్టులు ఖాళీ అవుతాయని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి.

సింగరేణి సంస్థలో సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోంది. క్లరికల్, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత స్థానాల్లో 90 శాతం అధికారులు సీమాంధ్రకు చెందిన వారే ఉన్నారు. ఆదినుంచి తెలంగాణ వాసులు కింది స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యారు. జిల్లాలో ఈ ఒక్క సంస్థలోనే సుమారు 320 మంది స్థానికేతరులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఆర్టీసీలోనూ సీమాంధ్రు ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

నాలుగో రోజుల్లో పూర్తి సమాచారం
 - ఎంఏ.హమీద్, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు

 జిల్లాలోని సీమాంధ్ర ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నాం. నాలుగు రోజుల్లో స్థానికేతర ఉద్యోగుల గుర్తిం పు పూర్తవుతుంది. ఇప్పటివరకు 350 మందిని గుర్తిం చాం. జిల్లాలో మొత్తం 1300 మందికి పైగా ఉంటార ని ప్రాథమిక సమాచారం. సింగరేణి, ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థలు కావడం, ప్రత్యేక పాలసీలు ఉండటంతో ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరముంది.

మరిన్ని వార్తలు