చలాన్ రాశాడని ట్రాఫిక్ ఎస్సైపై దాడి

27 Jun, 2015 19:37 IST|Sakshi

లంగర్‌హౌస్ (హైదరాబాద్) :  విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సైపై మళ్లీ దాడి జరిగింది. కొద్ది నెలల్లోనే వివిధ ప్రాంతాల్లో ఈ ఎస్సైపైనే దాదాపు 20 సార్లకు పైగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. లంగర్‌హౌస్ పోలీసుల కథనం ప్రకారం... టి.మధు టోలీచౌకీ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్నారు. శనివారం ఈయన మొఘల్‌నగర్ రింగ్‌రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. కాగా మధ్యాహ్నం సమయంలో గుడిమల్కాపూర్ వైపు నుంచి ఓ లారీ అత్తాపూర్ వైపు వెళ్తోంది.

ఎస్సై మధు ఆ లారీని ఆపారు. ప్రవేశం లేని సమయంలో లారీతో ఈ రోడ్డుపైకి ఎలా వచ్చావని డ్రైవర్‌ను ప్రశ్నించి, రూ.1100 చలాన్ విధించారు. అంతలోనే లారీ యజమాని సయ్యద్ హరీషుద్దీన్ అక్కడకు చేరుకుని ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. 'మా లారీలను పార్కు చేసే ప్రాంత సమీపానికి వచ్చి చలాన్లు రాసి వేధిస్తావా?' అని దుర్భాషలాడి ఎస్సైపై దాడి చేశాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు