మళ్లీ బరిలోకి !

22 Sep, 2018 11:53 IST|Sakshi
కె.వీరారెడ్డి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది.. ఉమ్మడి జిల్లా సహకార సొసైటీ బ్యాంకు(డీసీసీబీ)కు ఏకధాటిగా 13 ఏళ్ల నుంచి కొనసాగుతుండడంతో అన్ని ప్రాంతాలపై పట్టు ఉంది.. ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్‌ ర్యాంకుతో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన సత్తా ఉంది.. అలాంటి నేత ప్రస్తుతం మరోసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.. ఆయనే పాలమూరు రాజకీయ భీష్ముడిగా పేరొందిన కె.వీరారెడ్డి. ‘సాక్షి’కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరారెడ్డి తన మనోగతాన్ని వెల్లడించారు. బ్యాంకు అభివృద్ధి, రైతులకు చేసిన సేవలతో పాటు రాజకీయ అనుభవం, ఈసారి ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతుండడానికి కారణాలు, ఉమ్మడి జిల్లా నేతలతో  రాజకీయ సంబంధాలు.. ఇలా పలు అంశాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... 

రైతులకు అండగా నిలిచాం... 
జిల్లా సహకార సొసైటీ బ్యాంకు(డీసీసీబీ)ని రైతులకు చేరువ చేయడంలో విజయం సాధించగలిగాను. అందుకే ఏకధాటిగా 13 ఏళ్లుగా డీసీసీబీ చైర్మన్‌గా కొనసాగుతున్నా. రైతుల్లో నాపై నమ్మకం ఉండడంతోనే చైర్మన్‌గా ఎన్నుకుంటున్నా రు. సహకార ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తామే తప్ప.. అనంతరం రాజకీయాలకు అతీతంగా రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నా. రుణాల మంజూరు విషయంలో అర్హులైన వారందరికీ అందజేస్తాం. అందుకే ఇన్నాళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా చైర్మన్‌గా కొనసాగగలుగుతున్నా. 

నూతన ఒరవడి 
డీసీసీబీ చైర్మన్‌గా బ్యాంకు అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చా. గతంలో లోటు పరిస్థితి ఉండగా.. గత ఎనిమిదేళ్లుగా లాభాల్లోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం బ్యాంకు వార్షికంగా రూ.2.48 కోట్ల లాభంతో నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులకు రూ.865 కోట్ల రుణాలు అందజేశాం. నేను బ్యాంకు పగ్గాలు చేపట్టాకే బంగారు ఆభరణాలపై రుణాలు అందజేస్తున్నాం. డిపాజిట్లు కూడా రూ.277 కోట్లకు పెరిగాయి. అలాగే ప్రభుత్వ రంగం వాటిల్లో రూ.176 కోట్లను పెట్టుబడి పెట్టాం. ఈ ఏడాది పంట రుణాలను రూ.350 కోట్ల లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.250 కోట్లు అందజేశాం. ఈ 13 ఏళ్ల కాలంలో సంస్థకు స్థిరాస్థులు సమకూర్చగలిగా. ముఖ్యంగా తొమ్మిది బ్రాంచ్‌లకు సొంత భవనాలు నిర్మించడం గర్వంగా ఉంది. 

ఆప్కాబ్‌ బాధ్యతలు.. అదృష్టం 
ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఆప్కాబ్‌ చైర్మన్‌గా బాద్యతలు దక్కడం అదృష్టంగా భావిస్తాను. ఆప్కా బ్‌ చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వíßహించిన వారిలో నేను రెండో వాడిని. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆప్కాబ్‌ చైర్మన్‌ పదవిని తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అప్పట్లో అంటే 2013లో మంత్రిగా ఉన్న డీకే అరుణ... సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సహచర మంత్రులను ఒప్పించి నాకు పదవి ఇప్పించగలిగారు. ఆ సమయంలో కరీంనగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తికి పదవి కోసం మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా ప్రయత్నించినా డీకే.అరుణ పట్టుదలతో నాకే దక్కింది.  

డీకేతో వైరం లేదు.. 
ఆప్కాబ్‌ చైర్మన్‌తో పాటు డీసీసీబీ చైర్మన్‌ కావడంలో డీకే.అరుణ కృషి ఉంది. అలాంటిది ఆమెతో నాకు వైరం ఏర్పడినట్లు ప్రచారం చేయడం కరెక్టు కాదు. కాకపోతే రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని భావిస్తున్నా. గతంలో నేను అమరచింత(ప్రస్తుతం ఈ స్థానం రద్దయ్యింది) ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. 1978 నుంచి 83 వరకు ఓసారి, 1989 నుంచి 94 వరకు మ రోసారి గెలుపొందాను. రెండోసారి గెలిచినప్పు డు కేబినెట్‌ ర్యాంకుతో ప్రభుత్వ విప్‌గా పనిచేశా ను. అనంతరం పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ దక్కలేదు. అప్ప టి నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత ఎన్నికల సందర్భంగా బరిలో దిగాలని భావించినా డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నాననే కారణంగా టికెట్‌ నిరాకరించారు.

అందుకే ఈసారి చివరి ప్రయత్నంగా ఓసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నా. అయి తే నేను గతంలో ప్రాతినిధ్యం వహించిన అమరచింత 2009లో రద్దయి అందులోని మండలాలు మూడు నియోజకవర్గాల్లోకి వెళ్లాయి. ఆత్మకూరు, అమరచింత, నర్వ మండలాలు మక్తల్‌ నియోజకవర్గంలోకి, ధన్వాడ, మరికల్‌ మండలాలు నారాయణపేట నియోజకవర్గంలోకి, సీసీ కుంట, దేవరకద్ర మండలాలు దేవరక్రద నియోజకవర్గంలోకి వెళ్లాయి. ఇందులో కాస్త పట్టున్న మండలాలు మక్తల్‌లో కలిసినందున అక్కడి నుంచి బరిలో దిగాలని బావిస్తున్నా. లేదంటే నారాయణపేట అయినా ఓకే. అందుకు అనుగుణంగానే రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ అవకాశం ఇచ్చినా సరే అని కాంగ్రెస్‌ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు.

అందుకే జైపాల్‌రెడ్డి వెంట.. 
ఈసారి ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని కొంత కాలంగా ప్రయత్నిస్తున్నా. ఈ విషయమై పార్టీ ముఖ్యనేత డీకే.అరుణను సంప్రదించినా ఎలాంటి హామీ లభించలేదు. మక్తల్‌ లేదా నారాయణపేట నుంచి అవకాశం కల్పించాలని విన్నవించాను. కానీ రెండు చోట్ల కూడా నాకు అవకాశం కల్పించడం లేదు. నారాయణపేటలో నేను ముందు నుంచి పనిచేస్తున్నా... నన్ను కాదని టీఆర్‌ఎస్‌ నేత శివకుమార్‌ను తీసుకొచ్చారు. అందులో భాగంగానే ముందు నుంచి పనిచేస్తున్న అందరం కలిసి నారాయణపేటలో సభ ఏర్పాటు చేసి జైపాల్‌రెడ్డిని ఆహ్వానించాల్సి వచ్చింది. ఇవన్నీ రాజకీయంగా, కాకతాళీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే తప్ప డీకే.అరుణతో వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు. 

మరిన్ని వార్తలు