కొత్త పంచాయతీలు ఏకగ్రీవం చేసుకోండి

3 Aug, 2018 10:27 IST|Sakshi
బ్రాహ్మణపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయతీని ప్రారంభిస్తున్న బాబూమోహన్‌

అందోల్‌ ఎమ్మెల్యే   బాబూమోహన్‌

బ్రాహ్మణపల్లి కొత్త పంచాయతీ ప్రారంభం

పాల్గొన్న కలెక్టర్, ఆర్డీఓలు

జోగిపేట(అందోల్‌) సంగారెడ్డి : జిల్లాలో మొదటి నూతన పంచాయతీ భవనాన్ని బ్రాహ్మణపల్లిలోనే నిర్మిస్తానని, అందుకు అవసరమైన నిధులను నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు అందోల్‌ ఎమ్మెల్యే పి.బాబూమోహన్‌ ప్రకటించారు. గురువారం అందోల్‌ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయతీని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ పుణ్యమాఅని నియోజకవర్గంలో చాలా వరకు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. ప్రభుత్వం కొత్త పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉందన్నారు. అభివృద్ధికి అడ్డుపడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త పంచాయతీల్లో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాన్ని అందరి అభిప్రాయాల మేరకు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఆరోగ్యం బాగా లేకున్నా నాకు ఇష్టమైన బ్రాహ్మణపల్లి గ్రామానికి వచ్చానని అన్నారు. తనకు భగవంతుడు ఆకాశమంత కీర్తిని ఇవ్వగలిగాడని, నాకు ఈ రోజు ఆరోగ్యం బాగా ఉంటే ఆస్ట్రేలియాలో ప్రధాని పక్కన కూర్చునే కార్యక్రమానికి వెళ్లే వాడినని, అలాంటి గుర్తింపు తనకు ఉందని, గ్రామాల్లో కొన్ని కలుపు మొక్కల వల్ల ఇబ్బందిగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ నర్సింగ్‌రావు, తహసీల్దార్‌ నాగేశ్వరరావు, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కే.రమేశ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు లింగాగౌడ్, జగన్మోహన్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ వర్కల అశోక్, కౌన్సిలర్లు శ్రీకాంత్, గోపాల్, లక్ష్మణ్, నవీన్, గ్రామ పెద్దలు నారాయణ భట్టాచారి, సుదర్శన భట్టాచారి, ఈఓ పీఆర్‌డీ శ్రీనివాసరావు, ఏపీఓ అర్చన, మార్కెట్‌ డైరెక్టర్‌ మల్లికార్జున్, మాణిక్‌రెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ యశస్విని, టీఆర్‌ఎస్‌ పట్టణ, యవత అ«ధ్యక్షుడు సీహెచ్‌. వెంకటేశం, జి.రవీంద్రగౌడ్, టీఆర్‌ఎస్‌ నాయకులు జాకీర్, శ్రీధర్‌రెడ్డిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు