రైతు బంధు అమలు చరిత్రాత్మక నిర్ణయం

23 Apr, 2018 16:48 IST|Sakshi
మంత్రి హరీశ్‌ రావు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, సంగారెడ్డి : రైతు బంధు పథకం అమలు చరిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో రైతు బంధు అమలుపై సోమవారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ‘రైతు బంధు పథకం అమలు చరిత్రాత్మక నిర్ణయం. రాష్ట్రం ఏర్పడిన మూడున్నర ఏళ్లలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు ఆరువేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నాం. అటవీ భూముల్లో పట్టాలున్న రైతులకు ఎకరాకు నాలుగు వేలు ఇస్తాం.రైతులు బ్యాంకులకు వెళితే డబ్బులు లేవనే సమస్య తలెత్తదు’ అని అన్నారు.

ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజా ప్రతినిధులకు, రైతు సమన్వయ సమితి కో- ఆర్డినేటర్లకు రైతులకు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణిపై అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు