ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం

24 Feb, 2018 08:21 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న మంత్రి మహేందర్‌రెడ్డి

నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకురావాలి

గుట్ట డిపోకు మరిన్ని బస్సులు

రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట (ఆలేరు) : ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉమ్మడి జిల్లా డిపో మేనేజర్లు, అధికారులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీలో మెరుగైన సౌకర్యాలు కల్పిండానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని తెలిపారు. సురక్షిత ప్రయాణం ఆర్టీసీలోనేనని పతి ఒక్క ప్రయాణికుడికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత డిపో మేనేజర్లకు ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి మండలంలో జరిగే జనరల్‌ బాడీ సమావేశానికి డిపో మేనేజర్లు వెళ్లాలని ఆదేశించారు.  ఆర్టీసీకి సీఎం కేసీఆర్‌రూ.1000కోట్ల బడ్జెట్‌ ఇచ్చారన్నారు. ఈ బడ్జెట్‌తో గతేడాది రూ.66కోట్లతో 1400బస్సులు, ఈ సారి రూ.75కోట్ల బడ్జెట్‌లో 1100బస్సులు కొత్తవి నడుపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 230 మినీ బస్సులు తిప్పుతున్నామని, ఇందులో వందకు పైగా ఎసీ బస్సులున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా 8బస్సులు ఇచ్చినట్లు తెలిపారు.

97 డిపోల్లో 27వరకు లాభాలు వస్తున్నాయని, నష్టాల్లో ఉన్న 49 డిపోలను సగానికి పైగా లాభాలకు తీసుకువచ్చామని, పూర్తిగా నష్టాల్లో ఉన్న డిపోలను కూడా లాభాల బాటలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. బస్సు, డ్రైవర్లకు ఇబ్బందికరంగా ఉన్న నిరుపేదలకు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి..ఆ జిల్లాలో బస్సులు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు సేవలు అందించే పల్లె వెలుగు బస్సులు భారీగా నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు 34కొత్త బస్సులు కావాలని అడిగారు. యాదాద్రి నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులు వెళ్లడం సంతోషకరమన్నారు. యాదగిరిగుట్టకు మినీ బస్సులు వేయాలని మంత్రిని ఆమె కోరారు.  సమావేశంలో రిజినల్‌ కో ఆర్డినేటర్‌ సువర్ణరెడ్డి, భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాలే సుమలత, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఆర్టీసీ ఓఎస్డీ కృష్ణకాంత్, నల్లగొండ, సూర్యాపేట డీవీఎంలు మధుసూదన్, ఎంఆర్‌సీరెడ్డి, డిపో మేనేజర్‌  రఘు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు