నేటి సాయంత్రంతో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
రోడ్ షోలతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేసిన ప్రధాన పార్టీల నేతలు
22న కరీంనగర్ మినహా మిగిలిన చోట్ల మున్సి‘పోల్స్’
కరీంనగర్లో మాత్రం 24న ఎన్నికలు
25న ఒకేసారి వెలువడనున్న అన్ని ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : పుర ప్రచార హోరుకు నేటితో తెరపడనుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. దీంతో గత వారం, పది రోజులుగా పట్టణాలు, నగరాల్లో మోగిన మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 24న ఎన్నికలు జరగనున్న కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో మాత్రం బుధవారం వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది. మొత్తం మీద ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర విమర్శనాస్త్రాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లిన పట్టణ ప్రాం తాలు సోమవారం సాయంత్రానికి కొంత కుదుట పడనున్నాయి. ఇక పోలింగ్కు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు పలు రూపాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం కానున్నారు.
కాళ్లకు బలపాలు కట్టుకొని...
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కాళ్లకు బలపాలు కట్టుకొని పట్టణాల్లో తిరిగారు. రోడ్ షోలు, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. అధికార టీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలే అన్ని బాధ్యతలు తీసుకొని ప్రచారం నిర్వహించడంతోపాటు స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. తన నియోజకవర్గమైన సిరిసిల్ల వరకే ప్రచారానికి పరిమితమైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచార శైలిని పర్యవేక్షిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలిస్తూ ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని వార్డులు, డివిజన్లలో అభ్యర్థులను వెంటపెట్టుకొని ప్రజలను ఓట్లడిగారు. టీఆర్ఎస్ ఈ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
టీఆర్ఎస్ నేతలపై విమర్శలు సంధించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఇక బీజేపీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు పర్యటించగా ఎమ్మెల్యే రాజాసింగ్తోపాటు ఇతర కీలక నేతలు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. వారితోపాటు స్థానిక నేతలు కూడా పెద్ద ఎత్తున బీజేపీ పక్షాన ప్రజల వద్దకు వెళ్లారు. ఎంఐఎం తరఫున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా వామపక్షాలు, టీజేఎస్ తదితర పార్టీల నేతలు కూడా ప్రచారం నిర్వహించారు. అన్ని పార్టీల నేతలు మున్సిపాలిటీలవారీగా స్థానిక సమస్యలను ఫోకస్ చేసుకుంటూ తమను ఎందుకు గెలిపించాలో కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా అన్ని పార్టీల అభ్యర్థులు, శ్రేణులు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నాయి. పోలింగ్కు మంగళవారం ఒక్కరోజే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించకపోయినా ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీ కానున్నారు. ఈ నెల 25న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి.
రె‘బెల్స్’మోగేనా?
రాజకీయ పార్టీల అధికారిక అభ్యర్థులకు దీటుగా ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడి రెబల్స్గా బరిలోకి దిగిన అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రులుగా బరిలో ఉన్న దాదాపు 3 వేల మందికిపైగా అభ్యర్థులు సైతం సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. స్థానికంగా ఉంటూ ప్రజల్లో మమేకమై పనిచేస్తున్న తమను ఆశీర్వదించాలని, తాము గెలిస్తే వార్డులు, డివిజన్లను అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చారు. అధికార టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా రెబల్స్ బరిలో ఉండటంతో వారి ప్రభావం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు: ఎస్ఈసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా... బుధవారం సాయంత్రం ఐదు గంటలలోగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అన్ని రకాల ఎన్నికల ప్రచారం ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటినీ అమలు చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యదర్శి ఎన్.అశోక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి భయం లేకుండా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.