ఎంపీ జితేందర్రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జేపీ నడ్డా సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఏపీలో గడిచిన మూడేళ్లలో దాదాపు 35 వేల ఎయిడ్స్ మరణాలు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. శుక్రవారం లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2014–15లో 8,380, 2015–16లో 14,129, 2016–17లో 12,169 మంది మరణించారని తెలిపారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మే వరకు 2,060 మంది మరణించారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2014–15లో 41,956, 2015–16లో 49,593, 2016–7లో 49,630 మరణించారని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే నెలాఖరు వరకు 9,837 మంది చనిపోయారని వివరించారు.
మాకూ ఐఐఎం ఇవ్వండి
తెలంగాణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) సంస్థను మంజూరు చేయాలని జితేందర్రెడ్డి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం లోక్సభలో ఐఐఎం బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ మేరకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. విభజన కారణంగా పలు జాతీయ ప్రాధాన్య సంస్థలు ఏపీకి వస్తున్నాయని టీడీపీ ఎంపీ రవీంద్రబాబు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.