37 ఏళ్లుగా ఐదు నక్షత్రాల హోటల్లోనే

21 Jun, 2014 08:16 IST|Sakshi
37 ఏళ్లుగా ఐదు నక్షత్రాల హోటల్లోనే

అనారోగ్యంతో మృతిచెందిన కోటీశ్వరుడు
- దశాబ్దాలకుపైగా ఐదు నక్షత్రాల

న్యూఢిల్లీ: మూడు దశాబ్దాలకుపైగా ఐదు నక్షత్రాల హోటల్ లోనే ఉంటున్న 81 ఏళ్ల వ్యాపారవేత్త చనిపోయాడు.  నగరంలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లోని ఓ విలాసవంతమైన సూట్‌లో 37 ఏళ్లుగా ఉంటున్న వ్యాపారవేత్త దాడి బల్సారా సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మ్యాక్స్ ఆస్పత్రిలో మృతిచెందాడు. 2009లోనే బల్సారా భార్య చనిపోయిందని, వారికి పిల్లలు లేరని అదనపు పోలీస్ కమిషనర్ ఎస్‌బీఎస్ త్యాగి తెలిపారు. మృతుడికి ఇద్దరు సోదరులు మాత్రమే ఉన్నారు. అనారోగ్యం బారినపడిన నాటినుంచి బల్సారా మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రవాస భారతీయుడైన బల్సారా 1991లో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాడు. తన ఉత్పత్తికి హిమాలయన్ అని నామకరణం చేశాడు.  తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లోని 901వ నంబర్‌గల అత్యంత విలాసవంతమైన సూట్‌లో కాలం గడిపేవాడు. అనేక సంవత్సరాలుగా తమ హోటల్‌లోనే బస చేస్తుండడాన్ని గమనించిన యాజమాన్యం...బల్సారాతో ఒక ఒప్పందం కుదుర్చుకుని కిరాయి తగ్గించింది. రోజుకు రూ. 15 వేలు చెల్లిస్తే సరిపోతుందని తెలి పింది. ఇలా అతను మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హోటళ్లనే నివాసం మార్చుకున్నాడు.  ఇదిలే ఉంచితే ఇతడు మధుమేహ  వ్యాధిపీడితుడు. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి.


ఎప్పటిలాగానే బుధవారం రాత్రి 9.30కి భోజనంచేసిన బల్సారా ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. 11.30కు నిద్ర లేచిన బల్సారా మళ్లీ నిద్రపోయాడు. గం2.30 సమయంలో బల్సారా గదికి అటెండెంట్ వచ్చాడు. బల్సారా కదలిక లేకుండా పడి ఉండడాన్ని గమనిం చిన అటెండెంట్... ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశాడు. కాగా బల్సారా గుండెపోటుతోనే చనిపోయినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 250 కోట్లు ఉన్నాయి. అందులో కొంతమొత్తాన్ని తన బంధువులకు, మరి కొంత మొత్తాన్ని విరాళాల కింద ఇవ్వాలని బల్సా రా అనుకున్నట్టు పోలీసులు తెలిపారు. బల్సారా మృతి సహజమరణమనేనని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు