పకడ్బందీగా ‘ఓపెన్’ పరీక్షలు

11 Apr, 2014 05:50 IST|Sakshi

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 16 నుంచి 25 వరకు జరగనున్న ఓపెన్‌స్కూల్ ఇంటర్, పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ చంద్రమోహన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఈఓ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 10,935 మంది హాజరుకానున్నారని, ఇందులో 8,791 మంది రెగ్యులర్, 2,144 మంది సప్లిమెంటరీ రాస్తున్నారని తెలిపారు. వీరికోసం 31 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు 31 చీఫ్ సూపరింటెండెంట్‌లు, 56మంది డీఓలు, అదనపు డీఓలు, 12 కస్టోడియన్స్, 550 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వెల్లడించారు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేస్తాయని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 27 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 6,862 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఇందులో 6,034 మంది రెగ్యులర్, 828 మంది సప్లమెంటరీ రాస్తున్నారని పేర్కొన్నారు.

 

ఈ పరీక్షల నిర్వహణకు 27 చీఫ్ సూపరింటెండెంట్‌లు, 28 డీఓలు, 15 కస్టోడియన్స్, 350 మంది ఇన్విజిలేటర్లు, 4 స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు సంబంధిత స్టడీ సెంటర్లలో హాల్‌టికెట్లు తీసుకోవాలని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి 1.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పరీక్ష లు ఉంటాయని తెలిపారు. 15 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని చెప్పారు. కార్యక్రమంలో డీఈసీ మెంబర్ గౌరిశంకర్, ఓపెనర్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ నారాయణగౌడ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు