రాజకీయం.. ఇక రిసార్ట్స్‌లో

25 Jan, 2020 08:11 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ నేతలు బుక్‌ చేసిన ఓ రిసార్టు

గెలుపొందిన వారిని క్యాంపులకు తరలించేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధం

నగర శివారులో పలు    రిసార్ట్స్‌ రిజర్వు  

సాక్షి, మేడ్చల్‌జిల్లా: మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్న నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులను వెంటనే క్యాంపులకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 27న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్‌తోపాటు డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ రిసార్ట్‌ రాజకీయాలకు తెరలేపింది. ప్రాదేశిక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లాగానే  మున్సిపల్‌ ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేయాలన్న పిలుపులో భాగంగా  మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలుపొందిన వారంతా అధిష్టానం నిర్ణయించిన మేయరు, ఛైర్మన్‌ అభ్యర్థులకు ఓటు వేసేలా క్యాంపులు నిర్వహించటానికి సన్నద్ధమైనట్టు సమాచారం. 

రెండు జిల్లాల్లో ఎన్నికలకు ముందే తొమ్మిది వార్డులను ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ కౌంటింగ్‌ పూర్తి కాగానే, గెలుపొందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అక్కడ నుంచి నేరుగా  క్యాంపులకు తరలించేందుకు నగర శివారు ప్రాంతాల్లో రిసార్టులను శుక్రవారం బుక్‌ చేశారు. మ్యాజిక్‌ ఫిగర్‌ రాని కార్పొరేషన్‌ లేదా మున్సిపాలిటీలో ఎవరైనా స్వతంత్రులు గెలిస్తే వారిని కూడా తమకే మద్దతు ఇచ్చేలా చూసి, వారిని కూడా క్యాంపులకు తరలించే అవకాశాలు లేకపోలేదు. 

మరిన్ని వార్తలు