భవిష్యత్తుకు భరోసా

22 May, 2019 10:28 IST|Sakshi

రారండోయ్‌ చదివిద్దాం’ కథనానికి స్పందన

టెన్త్‌లో మెరిసిన పేద విద్యార్థులను

ఆదుకునేందుకు ముందుకొచ్చిన దాతలు

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన ఆ పేదింటి బిడ్డలను ఆదుకునేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. కొంత మంది ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాగా, మరికొంత మంది విద్యార్థులు ఏ కాలేజీలో చదివితే..ఆ కాలేజీ ఫీజు మొత్తం చెల్లించేందుకు సిద్ధం అన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇటీవల వెల్లడైన పది ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అండగా నిలవాలని ‘సాక్షి’ పిలుపు నివ్వడం, ఆ మేరకు వారి ఫొటోలతో సహా ‘రారండోయ్‌ చదివిద్దాం’ శీర్షికతో మంగళవారం హైదరాబాద్‌ సిటీ ఎడిషన్‌లో ప్రధాన వార్తగా ప్రచురించిన విషయం తెలిసిందే.

ఈ కథనానికి స్పందించి సామాజిక బాధ్యతలో భాగంగా నిరుపేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందజేసేందుకు అమెరికాలోని బోస్టన్‌ వాసి బిగ్‌ హెల్ప్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ సీఈఓ చాంద్‌పాషా, ఆయన సోదరుడు ఎస్‌కే సైదా సూరజ్‌ సహా గాంధీనగర్‌కు చెందిన శ్రవణ్, కుత్పుల్లాపూర్‌ సుచిత్రకు చెందిన పి.రఘురాంరెడ్డి, జీడిమెట్లలోని జీఆర్‌పవర్‌  స్విచ్‌గేర్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాల్‌రెడ్డి చెన్నూరు, హస్తినాపురం చెందిన విశ్వమిత్రా, నాగోలుకు చెందిన ప్రసాద్, జీడిమెట్లకు చెందిన రమేష్‌రెడ్డి, బాలానగర్‌కు చెందిన రమేష్, సైనిక్‌పురికి చెందిన ఆర్కిటెక్ట్‌ రమేష్, కృష్ణానగర్‌కు చెందిన గృహిణి జయశ్రీ, నాగోల్‌కు చెందిన ప్రసాద్‌లు ముందుకు వచ్చారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, వారికి సహాయం అందజేసే దాతలను ‘సాక్షి’ త్వరలోనే ఓ వేదికపైకి తీసుకొచ్చి, వారి సమక్షంలోనే దాతల సహాయం అందజేయనుంది. ఇంకా దాతలెవరైనా స్పందించాలనుకుంటే 9912199718, 9912199507 నెంబర్లలో సంప్రదించవచ్చు.  

మరిన్ని వార్తలు