ప్రైవేట్‌కే పండగ!

7 Oct, 2019 12:17 IST|Sakshi
రైల్వే స్టేషన్‌లో బారులుతీరిన ప్రయాణికులు

ఆర్టీసీ సమ్మెతో దోపిడీపర్వం   

ప్రైవేట్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీలు  

ఆర్టీసీ అద్దె బస్సుల్లోనూ అంతే..  

ప్రయాణికుల జేబు గుల్ల  

పండగ సంబరం ఆవిరి  

ఆర్టీసీకి నష్టాల పరంపర    

కిక్కిరిసిన మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు

డిపోల ఎదుట కార్మికుల నిరసన  

సాక్షి, సిటీబ్యూరో: సాధారణ రోజుల్లోహైదరాబాద్‌–విజయవాడ నాన్‌ ఏసీబస్‌ చార్జీ రూ.370, ఖమ్మంకు రూ.250, కరీంనగర్‌కు రూ.200... కానీ ఆదివారం వరుసగా రూ.900, రూ.500, రూ.400 వసూలు చేశారు. ఇలా ఒక్క ప్రాంతమని కాదు... తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతానికైనా రెట్టింపు చార్జీలు వడ్డిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ప్రైవేట్‌వాహనాలకు అనుమతులివ్వడంతోఅందినకాడికి దండుకుంటున్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల్లోనూ దోపిడీపర్వంకొనసాగిస్తున్నారు. ఓవైపు సమ్మె... మరోవైపు ‘ప్రైవేట్‌’ దోపిడీతోప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు దాదాపు 50శాతం అధిక చార్జీలుసమర్పించారు. దీంతో ప్రయాణికుల పండగ సంబరం ఆవిరి కాగా... ప్రైవేట్‌ బస్సుల నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచిఆదివారం రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు దాదాపు 2వేల బస్సులునడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటిలో సింహభాగంఅద్దె బస్సులే ఉన్నాయని చెప్పారు. 

అంతటా దోపిడీ...  
గ్రేటర్‌ పరిధిలో 29 డిపోల్లోని మొత్తం 3,800 బస్సులకు గాను.. ఆదివారం కేవలం 1,200 బస్సులే రోడ్డెక్కాయి. వీటిలో 370 అద్దె బస్సులున్నట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో బస్సులను నడిపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ బస్సుల్లోనూ కండక్టర్లు చేతివాటం ప్రదర్శించి ప్రయాణికుల జేబులు గుల్ల చేశారు. తక్కువ దూరాలకు రూ.10 చార్జీకి రూ.20 వసూలు చేసి దోపిడీ చేశారు. విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు అడిగినంత సమర్పించుకున్నారు. ఇక ఆటోలు, క్యాబ్‌లలోనూ దోపిడీ కొనసాగింది. పలు ప్రధాన మార్గాల్లో స్వల్ప దూరాలకే రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. క్యాబ్‌ సర్వీసుల్లో అదనపు శ్లాబు రేట్లు, సర్‌ చార్జీల పేరుతో ప్రయాణికులను నిలువు దోపిడీ చేశారు. కార్మికులు ఆదివారం డిపోల ఎదుట బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకోగా పోలీసులు జోక్యం చేసుకొని బస్సుల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. 

రైళ్లలో రద్దీ... 

సమ్మె నేపథ్యంలో మెట్రో, ఎంఎంటీఎస్, సాధారణ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సుమారు 127 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్లో దాదాపు 1.75 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–హైటెక్‌సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు, ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. సుమారు 100 అదనపు సర్వీసులను నడిపినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వీసుల్లో ఆదివారం సుమారు 4లక్షల మంది జర్నీ చేశారన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ రద్దీ నెలకొంది. రైళ్లలో సీట్లు, బెర్తులు దొరక్క ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 

ఆర్టీసీ నష్టం.. రూ.6 కోట్లు  
గ్రేటర్‌ పరిధిలోని 29 డిపోల్లో తాత్కాలిక ఉద్యోగుల సాయంతో అరకొరగా బస్సులు నడుపుతుండడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. ఆదివారం కేవలం రూ.12 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. తాత్కాలిక కండక్టర్లు అందినకాడికి దండుకోవడం, టికెట్ల జారీపై వారికి స్పష్టత లేకపోవడంతో ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. గ్రేటర్‌ ఆర్టీసీకి శని, ఆదివారాల్లో ఏకంగా రూ.6 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.

మరిన్ని వార్తలు