హడావుడి ఎన్నికలు వద్దు..

8 Sep, 2018 01:29 IST|Sakshi

ఐదేళ్ల గడువు ముగియకముందే ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం

‘ముందస్తు’పై ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో వ్యాజ్యం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ రద్ద యిన నేపథ్యంలో హడావుడిగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సం ఘాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని, అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు విడిగా నోటిఫికేషన్‌ జారీ చేయకుండా ఎన్నికల సం ఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఐదేళ్ల కాల పరి మితి ముగియక ముందే అసెంబ్లీ ఎన్నికలు నిర్వ హించడం రాజ్యాంగ విరుద్ధమని, ముందస్తు ఎన్నికల దిశగా ఎటు వంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలని వ్యాజ్యంలో పే ర్కొన్నారు.

ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉంది. ‘నిబంధనల ప్రకారం ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగాలి. ఆ మేరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2019లో జరగాల్సి ఉంది. ప్రజలు ఐదేళ్ల పాటు పదవీ కాలంలో ఉండేందుకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నా రు. మంత్రిమండలికి శాసనసభను రద్దు చేసే అధికారం ఉంది. త్వరలోనే పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీకి విడిగా నిర్వహించడం సరి కాదు. దీంతో కోట్ల మేర ప్రజాధనం వృథా అవుతుంది. ముందస్తు వల్ల సంక్షేమ, అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఓటరుగా ‘ముందస్తు’కు వెళ్లాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా.

రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు ఎన్నికలు నిర్వహిం చాలని మంత్రిమండలి కోరుకుంటోంది. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపే అవకాశం లేకపోలేదు. అసలు ఓటర్ల జాబితా ఖరారు కాకుండా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. రాజకీయ లబ్ధి పొందేందుకు ఓ వ్యూహం ప్రకారమే శాసనసభ రద్దుకు మంత్రి మండలి సిఫారసు చేసింది. ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సహేతుకమైన కారణం ఏదీ లేదు. కాబట్టి ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది..’అని పిటిషనర్‌ వాజ్యంలో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు