అర్హులకే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

8 Mar, 2019 10:53 IST|Sakshi

బీడీకార్మికులకు ఇళ్లు మంజూరు చేస్తాం 

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

బాన్సువాడ రూరల్‌: అర్హులైన నిరుపేదలకే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేస్తామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన బోర్లం క్యాంపుతో పాటు గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించారు. బోర్లం క్యాంపు లోని దుర్గమ్మ గుడి ముందు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్థలానికి తోడు మరో ఎకరం పట్టా స్థలం కొని ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అలాగే బోర్లంలోని అంబేడ్కర్‌ భవన్‌ ఎదురుగా ఉన్న స్థలంలో తొలివిడతలో 30 మందికి డబుల్‌ ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. గ్రామస్తులు ప్రభుత్వం ఇస్తున్న నిధులతో తామే సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటామని స్పీకర్‌ దృష్టికి తీసుకురాగా ఆయన సమ్మతించారు. అలాగే ఆదిబసవేశ్వర మందిరం సమీపంలో బీడీ కార్మికుల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరో ఎకరం స్థలం కొనుగోలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.

త్వరలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 5.04 లక్షలు మంజూరు చేస్తుందని, లబ్ధిదారులు తిరిగి ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కో–ఆర్డినేటర్‌ అంజిరెడ్డి,  సర్పంచ్‌ సరళ, సొసైటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు పుట్టి లక్ష్మి, ఉపసర్పంచ్‌ మంద శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మోహన్‌నాయక్, నాయకులు మహ్మద్‌ ఎజాస్, నార్లసురేష్, కొత్తకొండ భాస్కర్, పాతబాలకృష్ణ, బన్సీనాయక్, బోడచందర్, నెర్రె నర్సింలు, దేవేందర్‌రెడ్డి, పుట్టి లక్ష్మణ్, గోపన్‌పల్లి సాయిలు, బసప్ప, జలీల్, రాజేశ్వర్‌గౌడ్, కృష్ణ  నాగభూషణం, ఎర్రోల్లబాలు, జీవన్‌ పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: పఢాయి కైసే హోరహీ హై.. ఆప్‌ సబ్‌ ఇస్‌ స్కూల్‌సే సంతుష్ట్‌ హై.. అంటూ రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మండలంలోని మైనారిటీ బాలిక గురుకుల పాఠశాల విద్యార్థినులతో ముచ్చటించారు. బోర్లం నుంచి గురువారం బాన్సువాడకు వెళ్తూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా..? బోధన ఎలా సాగుతోంది..? పౌష్టికాహారం అందిస్తున్నారా..? అంటూ విద్యార్థినులతో ముచ్చటించారు. నెలలో ఎన్నిసార్లు చికెన్, ఎన్ని సార్లు మటన్‌ పెడ్తున్నారు. ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్‌ ఏం చేశారు అంటూ ఆరా తీశారు. ఎవరెవరు ఎక్కడెక్కడి వారు అంటూ పలువురిని ప్రశ్నించారు. మరోసారి తీరిగ్గా వస్తానని..చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. 

పఢాయి కైసే హోరహీ..

మరిన్ని వార్తలు