షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

30 Nov, 2019 12:55 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి : షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రియాంకారెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, నగర ప్రజలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేసుకుంటూ స్టేషన్‌లోకి వచ్చేందుకు యత్నించారు. బారికేడ్లను తోసుకుంటూ స్టేషన్‌వైపు పరుగులు తీశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను కంట్రోల్‌ చేయలేక పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

నిందితులను ఆస్పత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌ వద్దకే డాక్టర్లను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నిందితులను షాద్‌నగర్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఆమె ఇంటికి వెళ్లనున్నారు. 

న్యాయ సహాయం అందించం
ప్రియాంకారెడ్డి హత్యను ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ బార్‌ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. నిందితులకు ఎటువంటి న్యాయ సహాయం అందించకూడదని మహబూబ్‌నగర్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ నిర్ణయించుకుంది. నిందితుల బెయిల్‌ కోసం ఎవరూ సహకారం అందించకూడదని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు