ట్రాఫిక్ నిబంధనలు పాఠ్యాంశాల్లో చేర్చాలి
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
రాష్ట్రంలో తొలి చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ప్రారంభం
సాక్షి, అల్గునూర్(మానకొండూర్): ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించి ప్రమాదాలు నివారించాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కరీంనగర్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో రాష్ట్ర మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల సంఘం ఆధ్వర్యంలో కృష్ణమనేని వెంకటరామారావు జ్ఞాపకార్థం నిర్మించిన తొలి ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ను ఆదివారం ప్రారంభించారు. ఈ మంత్రులు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల గురించి గతంలో పాఠ్యపుస్తకాల్లో ఉండేది కాదన్నారు. దీంతో చదువుకున్నవారికి కూడా నిబంధనలపై సరైన అవగాహన లేదన్నారు. భవిష్యత్లో ప్రమాదాలు అరికట్టేందుకు, చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాకు చెందిన జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ పాపారావు తన తండ్రి జ్ఞాపకార్థం కరీంనగర్ రవాణాశాఖ కార్యాలయం ఆవరణలో ట్రాఫిక్ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్కును నిర్మించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఇక్కడికి తీసుకువచ్చి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
విదేశాల్లో ట్రాఫిక్ పోలీసులుండరు..
విదేశాల్లో ట్రాఫిక్ పోలీసులు ఉండరని మంత్రులు అజయ్కుమార్, గంగుల కమలాకర్ అన్నారు. ఆయా దేశాల్లో చిన్నతనం నుంచే పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రులు పాఠశాలల్లో
ఉపాధ్యాయులు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అందుకే ఎంత రద్దీ ఉన్నా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని, ప్రమాదాలు కూడా తక్కువగా జరుగుతాయని వివరించారు. అధికారులు ఎంతమంది ఉన్నా ప్రమాదాలు పూర్తిగా నివారించడం సాధ్యం కాదని, స్వీయ అవగాహనతో నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయన్నారు.
ప్రమాద మృతుల్లో యువతే ఎక్కువ..
రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్నవారిలో, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారిలో ఎక్కువ శాతం యువతే ఉండడం బాధాకరమని మంత్రులు పేర్కొన్నారు. అతివేగం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం తదితర కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. మన రాష్ట్రంలో కూడా ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలపై తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. అందరూ పాటించేలా ఇంట్లో, బడిలోనే తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ ట్రాక్లు నిర్మిస్తాం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల్లో త్వరలో డ్రైవింగ్ ట్రాక్లు నిర్మిస్తామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో 59 రకాల సేవలు అందిస్తామని పేర్కొన్నారు. దీనికి సబంధించిన ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. మొబైల్ యాప్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేస్తామని, అందరికీ ఉపయోగపడేలా చూస్తామని చెప్పారు. 1.22 కోట్ల వాహనాలు రాష్ట్రంలో రోడ్డుపై తిరుగుతున్నాయన్నారు. అందులో 90 లక్షలు ద్విచక్రవాహనాలే అని పేర్కొన్నారు. అందరూ రోడ్డ భద్రత నియామాలు పాటించేలా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుదన్నారు.
పేదలకు భారం కావొద్దని..
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన రవాణా చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని మంత్రి అజయ్కుమార్ తెలిపారు. నూతన చట్టం ప్రకారం భారీగా పెనాల్టీలు ఉన్నందున అవి వాహనదారులకు భారంగా మారుతాయని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మన చట్టం మనమే రూపొందించుకోవాలని సీఎం సూచించారన్నారు. రాస్త్రా అనే కార్యక్రమం ద్వారా రూ.14 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సునీల్శర్మ, జేటీసీలు మమత, నాయక్, రమేశ్, కరీంనగర్ డీటీసీ శ్రీనివాస్, మండలి విప్ భానుప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టూరిజం శాఖ రాష్ట్ర చైర్మన్ భూపతిరెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్, ఎమెల్సీ, నారదాసు లక్ష్మణ్రావు, జెడ్పీటీసీ ఇనుకొండ శైలజ, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఎంపీటీసీ వేల్పుల మమత, సర్పంచ్ దుండ్ర నీలమ్మ, రాష్ట్రంలోని ఎంవీఐలు, ఏఎంవీఐలు, తదితరులు పాల్గొన్నారు.