15వేల డాక్టర్‌ పోస్టులు భర్తీ చేయాలి

19 Dec, 2019 02:27 IST|Sakshi

మంత్రి ఈటలకు బీసీ సంఘం వినతి

సాక్షి, హైదరాబాద్‌: వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 15 వేల డాక్టర్ల పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి వినతిపత్రాన్ని అందించారు. చాలా ఆస్పత్రుల్లో స్పెషలైజ్డ్‌ డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో వివిధ రకాల రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని వివరించారు. వైద్యం పూర్తి ఉచితంగా ఇవ్వాలని, ఈమేరకు ప్రభుత్వ ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. వైద్యుల పోస్టులతో పాటు కింది స్థాయి సిబ్బంది ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని మంత్రిని కోరారు. ఆస్పత్రుల్లో ఖాళీల జాబితాను రూపొందించి భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.   

>
మరిన్ని వార్తలు