రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతోనే దేశంలో పరిపూర్ణ ప్రజాస్వామ్యం సాధ్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని... ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పక్షపాత రహితంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో భారీగా ఓటర్లను తొలగించారని వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తానన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శిగా బిజీగా ఉండటంతో బాధ్యతలు చేపట్టేందుకు ఆలస్యమైందని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటివరకు నామినేషన్ దాఖలు కాలేదన్నారు.