ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

8 Jan, 2019 02:42 IST|Sakshi

మహిళ మృతి

మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌

హైదరాబాద్‌: మద్యం మత్తులో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఐఆర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకీలో నివాసముండే మహ్మద్‌ ఇక్రమ్‌అలీ (26) ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ 20 రోజుల క్రితమే ఉద్యోగం మానేశాడు. ఆదివారం రాత్రి బార్కాస్‌లో జరిగిన పార్టీలో పీకలదాకా మద్యం తాగాడు. సోమవారం ఉదయం ఇంటికి కారులో బయలుదేరాడు. మద్యం మత్తులో ఉన్న అలీ ఔటర్‌పై దారితప్పి గచ్చిబౌలి, గౌలిదొడ్డి మీదుగా అతివేగంగా గోపన్‌పల్లి వైపు వెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో గౌలిదొడ్డిలోని ప్రభుత్వ పాఠశాల వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

అంతటితో ఆగకుండా 60 మీటర్ల దూరంలో పార్క్‌చేసి ఉన్న స్కూటర్‌ను ఢీకొట్టి ఓ ఇంట్లోకి దూసుకుపో యింది. ఇంటి గోడలు ధ్వంసం కావడంతో ఇంట్లో ఉన్న మధుబాయ్‌(45) అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. హౌస్‌కీపింగ్‌ పనులు చేసుకునే మధుబాయ్‌ భర్త సట్వాజీ 2010లోనే మృతి చెందాడు. వారికి ఐదుగురు సంతానం. నిందితుడు ఇక్రమ్‌ అలీని స్థానికులు పోలీ సులకు అప్పగించారు. బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా నిందితుడిని పరీక్షించగా ఆల్కహాల్‌ శాతం 168 ఎంఎల్‌గా నమోదైంది. పోలీసులు అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు