రైస్ మిల్లులు అమ్మబడును

24 Dec, 2014 03:18 IST|Sakshi

ఒకప్పుడు జిల్లా నుంచి నూకలు ఎగుమతి చేసినా పొరుగు రాష్ట్రాల్లో విపరీతమైన గిరాకీ ఉండేది. దొడ్డు రకం వడ్లకైతే చెప్పనక్కర్లేదు. మిల్లింగ్ అయిన వెంటనే ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు సీన్  మారింది. నూకలు కాదు కదా... దొడ్డు బియ్యం పంపినా అక్కడ కొనేవారే కరువయ్యారు. ధైర్యం చేసి దొడ్డు వడ్లు కొందామన్నా అవి కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఉప్పుడు బియ్యం పరిస్థితి మరీ హీనం. వాటిని తీసుకునే నాథుడే లేడు. నాడు ధాన్యాగారాలుగా విలసిల్లిన కరీంనగర్ జిల్లాలోని రైస్ మిల్లులు నేడు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 50 మిల్లులు అమ్మకానికి సిద్ధమవుతున్నాయి. -పెద్దపల్లి/సుల్తానాబాద్
 
 పెద్దపల్లి/సుల్తానాబాద్: తెలంగాణలో రైస్ మిల్లులు అత్యధికం గా కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ 800 పైగా రైస్‌మిల్లులుండగా వీటిలో 430 పారాబాయిల్డ్ రైస్‌మిల్లులే. కేరళ, పశ్చిమబెంగాల్, గు జరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో గతంలో భారీ రైస్‌మిల్లుల వ్య వస్థ లేదు. దీంతో బియ్యం కోసం ఆయా రా ష్ట్రాలు రైస్ మిల్లులు అధికంగా ఉన్న కరీంనగ ర్, నల్గొండ జిల్లాలపై ఆధారపడేవి.
 
  ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి మారింది. మొన్నటి వరకు 50 రైస్ మిల్లులు కూడా కేరళలో నేడు 150 మిల్లులు వెలిశాయి. మొన్నటి వరకు జిల్లా లో అధికంగా ఉత్పత్తి అయ్యే దొడ్డు రకం బి య్యానికి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో డిమాండ్ ఉండేది. ఆయా రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల్లో నివసించేవారు అత్యధికంగా ఈ బియ్యాన్ని కొనుగోలు చేసేవారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు వరిసాగు మొదలుకావడంతో ఇక్కడ డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. మరోవైపు అక్కడక్కడ ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దొడ్డు బియ్యాన్ని ఉత్పత్తి చేద్దామని భావించినా ఆ రకం వడ్లు లభించడమే గగనంగా మారింది.
 
 పోటీ తీవ్రం
 రైస్‌మిల్లుల  యజమానుల్లో పోటీ తీవ్రతరమైం ది. గ్రూపులు, రాజకీయాలు ఎక్కువయ్యాయి. అధికారుల దాడులూ పెరిగాయి. అధిక లాభాలొస్తాయనే భావనతో కోట్లు అప్పుతెచ్చి కొత్తగా రైస్ మిల్లులు స్థాపించిన వారు పోటీ తట్టుకోలేకపోతున్నారు. అనుభవరాహిత్యం వల్ల నష్టాలబాటలో పయనిస్తున్నాయి. దీనికితోడు నెలవారీగా మిల్లుకు వస్తున్న విద్యుత్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ఒక్కో మిల్లుకు సగటున ప్రతినెలా రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి.
 
 తడిసిమోపెడవుతున్న నిర్వహణ
 ఒక్కో రైస్‌మిల్లు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల పేరిట సగటున ప్రతినెలా రూ.3-5 లక్షలు భరించాల్సి ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడం, తప్పనిసరిగా జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి రావడంతో రైస్ మిల్లుల యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మారిన లెవీ విధానం కూడా మిల్లర్లకు శరాఘాతమైంది. 25 శాతం లెవీని మాత్రమే తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో మిగిలిన ధాన్యం అమ్మకం తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వం చెల్లించే మిల్లింగ్ చార్జీలు కూడా 1984 నాటి టారిఫ్‌ను అమలు చేస్తుండటంతో మిల్లర్లకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేద ని తెలుస్తోంది.
 
 తెలంగాణ టు ఛత్తీస్‌గఢ్
 .ఇక్కడ రైస్‌మిల్లుల నిర్వహణ తలకుమించిన భారం కావడంతో మిల్లర్లు పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితి కొంత ఆశాజనంగా ఉండటంతో అటువైవు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సుమారు 50 మంది మిల్లర్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి అక్కడ వ్యాపారం చేయడం వల్ల ఏ మేరకు లాభం ఉంటుందనే అంశంపై సర్వే నిర్వహించి వచ్చారు. తెలంగాణతో పోలిస్తే అక్కడే లాభాలు అధికంగా వచ్చే అవకాశాలున్నాయనే భావనకు వచ్చిన వారు అటువైపు వెళ్తున్నారు.
 
 లక్కీ లాటరీ
 అటు పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేక, ఇటు ఇక్కడే ఉండి వ్యాపారాన్ని కొనసాగించలేని యజమానులు రైస్‌మిల్లులను అమ్మకానికి పెట్టారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాల్లోనే ఏకంగా 50 వరకు రైస్‌మిల్లులు అమ్మకానికి బేరం పెట్టారు. బయటవారు ఆయా మిల్లులను కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో తమ భాగస్వాముల్లోనే ఒకరు తీసుకుంటేనే మేలనే  నిర్ణయానికి వచ్చారు. ఎవరు తీసుకోవాలనే దానిపైనే భిన్నస్వరాలు వ్యక్తం కావడంతో లాభం లేదనుకున్న భాగస్వాములు లాటరీ వేసుకుంటున్నారు. చిట్టీలపై పేర్లు రాసి ఒక బాక్స్‌లో వేసి అందులో ఒక చిట్టీని తీస్తున్నారు.
 
  ఆ చిట్టీపై ఎవరి పేరు ఉంటే వారే రైస్ మిల్లును స్వాధీనం చేసుకోవాలి. మిగిలిన భాగస్వాములకు డబ్బులు చెల్లించాలి. దీంతో లాటరీలో పేరొచ్చిన వారి ముఖాల్లో వెలుగు లేకుండా పోతోంది. సంక్షోభంలో ఉన్న రెస్ మిల్లును ఎలా బయటపడేయాలో, మిగిలిన భాగస్వాములకు డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
 
 కొంపముంచుతున్న కరెంట్ బిల్లులు
 రైస్‌మిల్లు నుంచి బియ్యం గింజ తీయకపోయినా నెలకు రూ.83 వేలు మినిమమ్ చార్జీ కింద చెల్లించాలి. ఏడాదిలో నాలుగు నెలలే  మిల్లులు నడుస్తాయి. మిగిలిన ఎనిమిది నెలలు కూలీల వేతనంతోపాటు కరెంట్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఇలా రూ.25 లక్షల అదనపు భారం రావడంతో మిల్లులు నష్టాల బారిన పడుతున్నాయి.     
  - ముత్యాల రాజన్న, మిల్లు యజమాని(పెద్దపల్లి)
 
 1984 నాటి మిల్లింగ్ చార్జీలే..
 ప్రభుత్వం మిల్లింగ్ చార్జీ కింద క్వింటాల్‌కు రూ.23 చొప్పున మిల్లర్లకు చెల్లిస్తుంది. 1984లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే ఇప్పటికీ అమలవుతోంది. అప్పటితో పోలిస్తే కరెంట్ చార్జీలు, నిర్వహణ వ్యయం పది రెట్లు పెరిగాయి. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినప్పటికీ మిల్లింగ్ చార్జీలు పెంచకుండా అన్యాయం చేస్తోంది. గుజరాత్‌లో క్వింటాల్‌కు రూ.60 చెల్లిస్తున్నారు. కనీసం ఆ మేరకైనా ఇక్కడ చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో రాబోయే కాలంలో మిల్లు యజమానుల ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదమూ లేకపోలేదు.
 - మొగుళ్లపల్లి కష్ణమూర్తి, మిల్లు యజమాని(పెద్దపల్లి)
 
 కేంద్రమే ఆదుకోవాలి
 కేంద్ర ప్రభుత్వమే రైస్‌మిల్లర్లను ఆదుకోవాలి. పరిశ్రమలకు రాయితీ ప్రకటించాలి. సివిల్ సప్లై అధికారులు కస్టమ్ మిల్లింగ్ కోసం ఇబ్బందులు చేయడంతో మిల్లులు అమ్మకాలకు ఉన్నాయ. కొత్తవారిని ఆదుకోవాలి.
 - ఎడవెల్లి రాంరెడ్డి, రైస్‌మిల్లర్స్
 అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
 
 కోళ్ల పరిశ్రమ మాదిరిగా
 ఆదుకోవాలి
 కోళ్ల పరిశ్రమ తరహాలోనే రైస్‌మిల్లులకూ సబ్సిడీనిచ్చి ఆదుకోవాలి. నష్ట నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. నష్టాల్లో ఉన్న మిల్లర్లకు రుణాలు చెల్లించేందుకు తగిన గడువు ఇవ్వాలి. ఇబ్బందులు పెట్టేలా ఉండరాదు.
 - పల్లా మురళి, రైస్ మిల్లర్స్
 సలహాదారుడు, సుల్తానాబాద్
 

మరిన్ని వార్తలు