అర్వపల్లిలో వేగంగా కూంబింగ్

5 Apr, 2015 09:43 IST|Sakshi

నల్లగొండ: అర్వపల్లిలో పోలీసులు తీవ్రంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జానకీపురం వద్ద ఎన్‌కౌంటర్‌లో హతమైన ముష్కరుల విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకొని మరిన్ని అధారాలకోసం అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఇద్దరు ముష్కరులు హతమవ్వగా వారికి చెందిన ఒక రైల్వే టికెట్ మూడో వ్యక్తి ఉండొచ్చనే అనుమానానికి తావివ్వడంతో అతడు ఎవరై ఉంటారు? ఎక్కడ ఉన్నాడు అనే వివరాలకోసం పోలీసులు గాలింపులు ప్రారంభించారు. అర్వపల్లిలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

అర్వపల్లి దర్గాలో ముష్కరులు తల దాచుకున్నారన్న సమాచారం తెలిసిందే. దీంతో వారికి ఎవరైనా సహాయం చేసి ఉంటారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అణువణువు జల్లెడ పడుతున్నారు. అక్కడే మౌలానా అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, నిందితుల చిత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు పంపించాలని కూడా భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే పంచనామా పూర్తి చేసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించిన దుండగుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనంతరం ఓ నాలుగు రోజులపాటు అక్కడే ఉంచనున్నారు. వారి తరుపున ఎవరైనా వస్తే వారికి అప్పగించాలని, లేదంటే పోలీసులే వారిని ఖననం చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు