రెండో విడత పరిషత్‌పోరు రేపే 

9 May, 2019 04:14 IST|Sakshi

ఏర్పాట్లు పూర్తి చేసిన ఎస్‌ఈసీ

నేటి నుంచి పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి  

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడత పరిషత్‌ పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఎన్నికల కు సంబంధించి బుధవారం సాయంత్రం 5 గంట లకు ప్రచారం ముగిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) రెండో విడత పోలింగ్‌కు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ విడతలో ఎన్నికలు జరగనున్న జిల్లాలు, మండలాల వారీగా బ్యాలెట్‌ బ్యాక్స్‌లు, బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేసి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా కేటాయించారు. వీటిని గురువారం ఉదయం నుంచి పోలింగ్‌ స్టేషన్ల వారీగా గ్రామాలకు తరలిస్తారు. 31 జిల్లాల పరిధిలో (తొలివిడత మేడ్చల్‌ జిల్లాలో పూర్తి) శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు, ఐదు జిల్లాల్లోని కొన్ని నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో 4 వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

రెండో విడతలో కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో పరిషత్‌ ఎన్నికలు ముగుస్తాయి. మిగిలిన 27 జిల్లాల్లో ఈ నెల 14న తుది విడత ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 27న అన్ని విడతలకు కలిపి పరిషత్‌ ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వా త ఎస్‌ఈసీ నిర్ణయించే తేదీల్లో జెడ్పీపీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్మ న్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. రెండో విడతలో 1 జెడ్పీటీ సీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.   

రెండో విడత ప్రచారం చేస్తే చర్యలు: ఎస్‌ఈసీ 
రెండోవిడత ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని బుధవారం ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ప్రచార నిర్వహణ కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల నేతలు, ప్రచార నిర్వాహకులు ప్రస్తుతం ఎన్నికలు జరిగే ప్రాంతాలు వదిలిరావాలని ఆదేశించింది.  ఇదిలా వుండగా, ఈ నెల 14న జరగనున్న తుది విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 12న సాయంత్రం 5 వరకు ఎన్నికల ప్రచారం నిర్వహణకు అవకాశం ఉండటంతో ప్రచారం జోరు పెరిగింది. మూడో విడతలో 161 జెడ్పీటీసీలు, 1,738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

>
మరిన్ని వార్తలు