ఉట్నూర్‌ సమస్యకు పరిష్కారం!

24 Dec, 2017 02:59 IST|Sakshi

     రంగంలోకి దిగిన సీఎస్, డీజీపీ

     ఉమ్మడి జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులతో చర్చలు 

     వివాదానికి శాశ్వత పరిష్కారంపై సీఎం దృష్టి : సీఎస్‌ ఎస్పీ సింగ్‌ 

     చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవు : డీజీపీ 

     చర్చలపై ఆదివాసీ, లంబాడీల అసంతృప్తి

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదివాసీ, లంబాడీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్ప గా, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి. కాగా, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉట్నూ ర్‌కు తరలివచ్చింది. శనివారం ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌లతో కలిసి హెలికాప్టర్‌లో ఉదయం ఉట్నూర్‌కు చేరుకున్నారు. సుమారు నాలుగు గంటలపాటు ఉట్నూర్‌ కేబీ కాంప్లెక్స్‌ లో గడిపారు. మొదట ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అధికారులతో, ఆపై ఆదివాసీ, లంబాడీ పెద్దలతో చర్చలు జరిపారు. మీడియాను ఈ సమావేశాలకు అనుమతించలేదు. 

శాశ్వత పరిష్కారంపై సీఎం దృష్టి: సీఎస్‌ ఎస్పీ సింగ్‌ 
ఆదివాసీ, లంబాడీల ఘర్షణ నేపథ్యంలో పాత ఆదిలాబాద్‌ జిల్లాలో చిన్నచిన్న సంఘటనలు జరగడంతో శాంతిభద్రతలపై కొంత ప్రభావం చూపిందని సీఎస్‌ ఎస్పీ సింగ్‌ అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారని అన్నారు. ఆ సందర్భంలోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పోలీసు,  అధికారులతో చర్చలు జరిగాయని తెలి పారు. పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. ఆయా కమ్యూనిటీ లీడర్లతో ముఖా ముఖి చర్చించామన్నారు. శాంతి స్థాపన కోసం సహకారం అవసరమని కోరగా, అందుకు ఇరువర్గాల పెద్దలు సహకరిస్తామని చెప్పారని తెలిపారు. హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత కలెక్ట ర్లు, ఎస్పీలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్షన్‌ ఇచ్చినట్లు చెప్పారు. చర్చల్లో అదనపు డీజీపీ అంజనీకుమార్, కరీంనగర్‌ డీఐజీ ప్రమోద్‌కుమార్, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీఐజీ ప్రభాకర్‌రావు, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీవో, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్, ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, ఎస్పీలు విష్ణు ఎస్‌.వారియర్, కల్మేశ్వర్‌లు పాల్గొన్నారు. 

చర్చలపై అసంతృప్తి..
చర్చలపై ఆదివాసీ, లంబాడీలు అసం తృప్తి వ్యక్తం చేశారు. చర్చల అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ చర్చలతో ఎలాంటి ఫలితం దక్కలేదని ఆదివాసీ సంఘం నేత నైతం రవి అన్నారు. హక్కుల సాధన కోసం ఆదివాసీలు శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని అన్నారు. వారితో కలసి చర్చలకు ఒప్పుకునేది లేదన్నారు. మరో ఆదివాసీ సం ఘం నేత బొంత ఆశరెడ్డి మాట్లాడుతూ చర్చలు పూర్తి కాలేదని, సీఎంను పిలవాలన్నారు. గవర్నర్‌ ఆదివాసీల దగ్గరికి రావాలన్నారు. లంబాడీ నాయకులు మాట్లాడుతూ లంబాడీలు ఆడపిల్లలను అమ్ముకుంటున్న సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయని, 45 రోజులుగా ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదని, పరిష్కారం లేనప్పుడు చర్చలు ఎలా ఫలప్రదమవుతాయన్నారు.

మరిన్ని వార్తలు