అక్రమాలు అరికట్టేందుకు ‘ఈ మొబైల్‌ మైనింగ్‌ యాప్‌’

1 Oct, 2023 03:29 IST|Sakshi

యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌:  మైనింగ్‌ విభాగంలో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఈ మొబైల్‌ మైనింగ్‌ యాప్‌’కు రూపకల్పన చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్‌ఐసీ)తో కలసి గనులు, భూగర్భ వనరుల శాఖ రూపొందించిన మొబైల్‌ యాప్‌ను శనివారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డీఎం కాత్యాయనిదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖనిజాలు, ఇటుక, ఇసుక తదితరాల రవాణా సమయంలో తనిఖీలు చేసి అనుమతులు ఉన్నాయా లేదా? అనే అంశాన్ని గనుల శాఖ సిబ్బంది తక్షణమే తెలుసుకునేందుకు ఈ యాప్‌ దోహదం చేస్తుందని మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేయడం, అనుమతులు ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో ఖనిజాల తరలింపు.. తదితరాలకు అడ్డకట్ట వేయడంతో పాటు జరిమానాల విధింపునకు కూడా ఈ యాప్‌ ఉపయోగపడుతుందన్నారు.

జరిమానా విధింపు, చెల్లింపు అంశాల్లో పారదర్శకతతో పాటు, ఆన్‌లైన్‌లో చెల్లింపులు ఈ యాప్‌ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఖనిజ రవాణా సమాచారాన్ని డీలర్లు, లీజు హోల్డర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, అనుమతుల నిర్ధారణ కూడా ఈ యాప్‌ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఈ యాప్‌ ఉపయోగంలోకి వస్తే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్‌ జియాలజిస్టులు, టెక్నీíÙయన్లు, రాయల్టీ ఇన్‌స్పెక్టర్లకు విధుల నిర్వహణ సులభతరమవుతుందని మంత్రి వెల్లడించారు. 
 

మరిన్ని వార్తలు