‘ఆర్టీసీని చంపొద్దు.. బతికించండి’

5 Oct, 2019 15:38 IST|Sakshi
వికారాబాద్ జిల్లాలో పోలీసు బందోబస్తు నడుమ ప్రైవేట్ డ్రైవర్లతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు

సాక్షి, పెద్దపల్లి జిల్లా: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) పాలన రజాకారుల రాజ్యాన్ని తలపిస్తోందని తెలంగాణ ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు గతంలో తెలంగాణ సాధన కోసం సమ్మెలోకి వెళితే... ఇప్పుడు కూడు కోసం సమ్మెలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని తమ సొంత సంస్థలా భావించే కార్మికులను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

రాష్ట్రంలో పెద్ద సంస్థ అయిన ఆర్టీసీని చంపేయాలని చూడడం సరియైది కాదని, ఆర్టీసీని బ్రతికించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 3 వేల 3 వందల కోట్ల నష్టంలో ఉన్న ఆర్టీసీ రోజుకు 3కోట్ల రూపాయల నష్టంలో నడుస్తోందని.. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రాస్ సబ్సిడీ ఉంటుంది, కానీ మన రాష్ట్రంలో క్రాస్ సబ్సిడీ లేదన్నారు. 10 వేల బస్సుల్లో 2 వేల బస్సులకు కాలం చెల్లిపోయినా ప్రభుత్వం కొత్త బస్సులను తెప్పించడంలో విఫలమైందన్నారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ రూ.1470 కోట్లు ఇవ్వాలని లేదంటే ప్రభుత్వమైనా ఈ మొత్తం చెల్లించాలని సోమారపు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. (చదవండి: కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె)

>
మరిన్ని వార్తలు