ఓల్వోకు టికెట్లు తీసుకుంటే హైటెక్ బస్ ఏర్పాటు
చెడిపోయి మధ్యలోనే నిలచిపోయిన బస్సు
అర్ధరాత్రి ప్రయాణికుల ఆందోళన
మన్సూరాబాద్: ఓల్వో బస్కు టెకెట్లు బుక్ చేసుకుంటే నాసిరకం హైటెక్ బస్సు (టీఎస్ 12 యూబీ 3645)ను పంపిన ఎస్వీఆర్ ట్రావెల్స్ యాజమాన్యం.. పంపిన బస్సు నగరం దాటకుండనే మార్గమధ్యంలో నిలిచిపోయిన సంఘటన శుక్రవారం రాత్రి ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్వీఆర్ ట్రావెల్స్లోని ఓల్వో బస్లో నగరం నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రయాణికులు టెకెట్లు బుక్ చేసుకున్నారు. సదరు ట్రావెల్స్ బస్సు ఎల్బీనగర్కు సాయంత్రం 6.30 గంటలకు రావాల్సి ఉంది.
ప్రయాణికులు పలు మార్లు ఫోన్ చేయగా ఎస్వీఆర్ యాజమాన్యం ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు హైటెక్ బస్సును పంపించింది. తీరా బస్సు చింతలకుంటకు రాగానే చెడిపోయి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు యాజమాన్యానికి ఫోన్ చేసి సమాచారం అందించినా పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు అర్ధరాత్రి అందోళనకు దిగారు. సాయంత్రం 6.30 నుంచి బస్సు కోసం ఎదరుచూస్తున్నామని, బస్సులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని, తిండి తిప్పలు లేకుండా రోడ్డుపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎర్పడిందని ఆవేదన చెందారు. ఎస్వీఆర్ ట్రావెల్స్ యాజమన్యం నిర్లక్ష్యం కారణంగానే తామంతా అవస్థలు పడుతున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.