రేపు,ఎల్లుండి చేప ప్రసాదం

7 Jun, 2014 01:14 IST|Sakshi
రేపు,ఎల్లుండి చేప ప్రసాదం
  •       పంపిణీకి అన్ని ఏర్పాట్లు
  •      ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను పరిశీలించిన కలెక్టర్, పోలీసు కమిషనర్
  •  సాక్షి,సిటీబ్యూరో: మృగశిరకార్తె సందర్భంగా ఈనెల 8,9వ తేదీల్లో ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ముఖేష్ కుమార్‌మీనా తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను సందర్శించిన కలెక్టర్.. కార్యక్రమ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

    చేపపిల్లల విక్రయ కేంద్రం, టోకెన్ కౌంటర్లు, పంపిణీ కౌంటర్లు, బారీకేడ్ల నిర్మాణం పనులతోపాటు మహిళలకు, వికలాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. అవసరమైన మేరకు మంచినీటి ప్యాకెట్లను అందజేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.

    ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను చేపట్టేలా సిబ్బందిని నియమించుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు..శాంతిభద్రతలు, విద్యుత్ సరఫరాపై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు జేసీ సంజీవయ్య, బత్తిన హరినాథ్‌గౌడ్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విన్‌మార్గమ్, హైదరాబాద్ ఆర్డీవో నిఖిల, పలువురు తహశీల్దార్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
     
    పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ
     
    అబిడ్స్: చేపప్రసాదం పంపిణీ ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ఎంకేమీనా ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం రాత్రి పర్యవేక్షించారు. ప్రసాదానికి వచ్చే వేలాదిమందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
     
    100 ప్రత్యేక బస్సులు : చేపప్రసాదం పంపిణీ సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్‌రావు తెలిపారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి సోమవారం రాత్రి రద్దీ ముగిసే వరకు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తామని చెప్పారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ లతోపాటు మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌ల నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 100 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. ‘చేపప్రసాదం స్పెషల్- ఎగ్జిబిషన్ గ్రౌండ్’ అనే పేర్లతో సర్వీసులు నడుస్తాయన్నారు.
     

మరిన్ని వార్తలు