కర్ణాటక కార్మికులకు బండి సంజయ్‌ అభయహస్తం

29 Mar, 2020 20:32 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కరీంనగర్‌లో చిక్కుకున్న కర్ణాటక కార్మికులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభయహస్తం అందించారు. ఆదివారం శాతవాహన యూనివర్సిటీ వద్ద కర్ణాటకకు చెందిన కార్మికుల దగ్గరకు వెళ్లారు. పనుల కోసం వచ్చి కరోనా కర్ఫ్యూతో వారం రోజులుగా దినదిన గండంగా గడుపుతున్న కార్మికులకు కావాల్సిన 11 రకాల నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ముగిసే వరకు ఉండటానికి కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.  కరోనా రక్కసిని తరిమికొట్టే వరకు ప్రజలు కొంత సంయమనం పాటించాలన్నారు.

కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు, ఫీడ్ ది నీడీ కార్యక్రమంలో భాగంగా నేడు పలు పేదలకు భోజనం అందించారాయన. తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ ఇబ్బందులు పడకుండా బీజేపీ కార్యకర్తలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు