రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

30 Mar, 2018 09:52 IST|Sakshi
మృతి చెందిన షేక్‌ సలీం, బాబూమియా, బాబు ఖురేషి

అదుపు తప్పి వాహనం బోల్తా

ముగ్గురు మృతి

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన

మృతులు జిల్లా వాసులే..

మృతుల్లో అన్నదమ్ములు

నిజామాబాద్‌ క్రైం/బోధన్‌రూరల్‌ : ఆదిలాబాద్‌ జిల్లా ఖానా పూర్‌ మండలం పులిమడుగు పంచాయతీ పరిధిలోని అందోలి గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన అన్నదమ్ములు హజీబాబు(52), సలీం ఖురేషీ(40) వారి బంధువు బోధన్‌ మండలం సాలూరకు చెందిన 2వ వార్డు సభ్యుడు ఖురేషి బాబు మీయా(58)లు తమ బంధువుల వివాహానికి సోమ వారం కుటుంబ సభ్యులతో కలిసి ఉట్నూర్‌ మండలం జంగాం గ్రామానికి తుఫాన్‌ వాహనంలో వెళ్లారు.

వివాహ వేడుకల అనంతరం బుధవారం రాత్రి నిజామాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. అందోలి గ్రామం వద్దకు రాగానే రోడ్డుకు అడ్డంగా అడవి పంది రావడంతో దానిని తప్పించబోయి వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో హజీబాబు, సలీం ఖురేషీ, ఖురేషి బాబు మీయాలు మృతి చెందారు. హజీబాబుకు భార్య ఇద్దరు కొడుకులు, సలీం ఖురేషీకు భార్య ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.

వీరి మృతదేహాలకు ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలు గురువారం రాత్రి నిజామాబాద్‌కు చేరుకోగా, 9 గంటల ప్రాంతంలో మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. కురేషి బాబు మీయా మృతికి సాలూర సర్పంచ్‌ సున్నపు గంగామణి వీరయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ బుద్దె రాజేశ్వర్, గ్రామస్తులు సంతాపం తెలిపారు.

 

మరిన్ని వార్తలు