స్నేహితురాలి మరణాన్ని తట్టుకోలేక..

9 Oct, 2017 01:52 IST|Sakshi

ట్రైనీ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

పోలీస్‌ అకాడమీలో ఘటన

రాజేంద్రనగర్‌: స్నేహితురాలి మరణాన్ని తట్టుకోలేక ఓ ట్రైనీ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పోలీస్‌ అకాడమీలో ఆదివారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా ముత్యాలమ్మ గూడేనికి  చెందిన నర్సింహ కూతురు నవీన (23) 2016లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది.

4 నెలలుగా పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతోంది. మరో రెండు నెలల్లో శిక్షణ పూర్తి కానుంది. అయితే, నవీనకు రేములపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మాధవి ప్రాణస్నేహితురాలు. పదవ తరగతి నుంచే వీరిద్దరి అభిప్రాయాలు ఒకటి కావడంతో స్నేహం కుదిరింది. 

అయితే, మాధవి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నవీన ఏడుస్తూ విశ్రాంతి గదిలోనే ఉంది.  తోటి ట్రైనీ కానిస్టేబుళ్లు రాత్రి భోజనాలకు వెళ్లగానే నవీన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వారంతా తిరిగి వచ్చి చూసే సరికి నవీన ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తన స్నేహితురాలు మాధవి మృతితో మనస్తాపం చెంది నవీన ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్‌ఐ సుధీర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు