తొలి మహిళా ప్రధాని ఘనత మాదే
మహిళా కాంగ్రెస్ సదస్సులో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశానికి తొలి మహిళా ప్రధానిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని మోదీ, కేసీఆర్లకు మహిళా సాధికార త గురించి మాట్లాడే హక్కులేదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద అధ్యక్షతన బేగంపేటలోని మానస సరోవర్ హోటల్లో జరిగిన సదస్సులో ఉత్తమ్ మాట్లాడారు. కాంగ్రెస్లో మహిళలకు ఉన్నత స్థానం కల్పించడంతోపాటు వారి నాయకత్వంలోనే పార్టీ నడుస్తోందన్నారు. మహిళలకు రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ ఎనలేని ప్రాధాన్యత కల్పించిందన్నారు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్వయం సహాయక గ్రూపుల పేరిట పెద్ద ఎత్తున ఆర్థిక సహకారాన్ని అందించి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద, మధ్యతరగతి మహిళలకు ఆర్థికంగా మేలు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున స్వయం సహాయక గ్రూపులను (ఎస్హెచ్జీ) ఏర్పాటుచేసి ఆర్థికంగా తోడ్పాటునందించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ అధికారంలోకి రాగానే పూర్తిగా ఈ స్వయం సహాయక గ్రూపులను నిర్వీర్యం చేశారని విమర్శిం చారు. దేశంలోనే మహిళకు స్థానం కల్పించని ఏకైక కేబినెట్ తెలంగాణేనన్నారు. ‘మోదీతో కేసీఆర్కు లోపాయికారీ ఒప్పందం ఉంది. ఈ విషయాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. బీజేపీ పాలనలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. రాహుల్ ప్రధాని కావడం దేశానికి ఎంతో అవసరం’అని ఉత్తమ్ పేర్కొన్నారు.
నాడు ఆరెస్సెస్ వ్యతిరేకత
మహిళలకు ఆస్తిహక్కు చట్టం తీసుకొచ్చింది తొలి ప్రధాని నెహ్రూయేనని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయాన్ని నాడు ఆరెస్సెస్ వ్యతిరేకించిందన్నారు. మనువాద మనస్తత్వం కలిగిన పార్టీ బీజేపీ అని ఆయన విమర్శించారు.
మోదీకి బీ–టీమ్గా కేసీఆర్: యాష్కి
కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి విమర్శించారు. ఫెడరల్ కూటమి పేరుతో మోదీకి బీ–టీమ్గా కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ‘కారు.. సారు.. బేకారు’ నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
త్యాగానికి ప్రతీక సోనియా: భట్టి
స్త్రీలకు సమాన హక్కు కాంగ్రెస్తోనే సాధ్య మని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కస్పష్టం చేశారు. మహిళలు సమర్థవంతంగా పాలించగలరు అనడానికి ఇందిరాగాంధీ ఎప్పటికీ ఉదా హరణగా నిలుస్తారన్నారు. యూపీఏకు నాయకత్వం వహించిన సోనియా త్యాగానికి ప్రతీక అని ప్రశంసించారు.