1000 సిటీ బస్సులు ఔట్‌?

8 Dec, 2019 04:29 IST|Sakshi

నష్టాలు తగ్గించుకునేందుకు ఆర్టీసీ అధికారుల యోచన

జనవరి ఒకటి నాటికి తొలగించాలని కసరత్తు

ఇక హైదరాబాద్‌లో మిగిలేవి 2,700 బస్సులే

కోటి జనాభాకు అవి సరిపోతాయా అని సందేహాలు

తగ్గించే బదులు సర్వీసుల రేషనలైజేషన్‌ చేయాలని సూచనలు

ఓఆర్‌ఆర్‌ అవతలకు నడిపితే ఆదాయం పెరిగే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: పెరుగుతున్న కాలుష్యానికి విరుగుడుగా ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్య పెంచటంతోపాటు సొంత వాహనాల స్థానంలో జనం వీలైనంత ఎక్కువగా ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించేలా ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారు. అయితే, దేశంలో కాస్మోపాలిటన్‌ సిటీగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి విరుద్ధంగా కని పిస్తోంది. దాదాపు కోటి జనాభా ఉన్న మరే నగరంతో పోల్చినా సిటీ బస్సులు ఇక్కడే తక్కువ. కేవలం ప్రధాన రోడ్లపై మాత్రమే సిటీ బస్సులు నడుస్తుంటాయి. దీంతో అంతర్గత ప్రాంతాల ప్రజలు బస్సు కోసం కొంత దూరం వెళ్లక తప్పని పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించ డానికి వీలైనన్ని ఎక్కువ బస్సులు అందుబాటులోకి తేవడం ద్వారా పెరిగిపోతున్న సొంత వాహనాల విస్తృతిని నియంత్రించాలని పలువురు సూచిస్తున్నారు. దీన్ని అనుసరించటం అటుంచి తే, ఇప్పుడు హైదరాబాద్‌లో ఏకంగా వేయి బస్సులను జనవరి 1 నాటికి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నగరంలో 2,700 బస్సులే ఉండనున్నాయి. పదేళ్ల క్రితం సిటీలో తిరిగిన బస్సుల సంఖ్యకిది సమానం. ఈ పదేళ్లలో హైదరాబాద్‌ లో 30 లక్షలకుపైగా జనాభా పెరిగింది. అందుకనుగుణంగా బస్సుల సంఖ్య పెరగాల్సి ఉండగా.. ఆర్టీసీ తిరోగమనంలో ఆలోచిస్తోంది.

నష్టాలను తగ్గించేందుకేనంటూ... 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.1200 కోట్ల నష్టాలను చవిచూడ నుందని అంచనా. ఇందులో రూ.550 కోట్ల నష్టం హైదరాబాద్‌ నుంచే ఉంటుందని చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగే కొద్దీ నష్టాలు పెరుగుతాయన్న సూత్రాన్ని అనుసరించి, బస్సుల సంఖ్య తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన రెండు సమావేశాల్లో సిటీ బస్సులతో వస్తున్న నష్టాలపై చర్చ జరిగింది. మధ్యాహ్నం వేళ బస్సు లు ఒకదాని వెంట ఒకటి తిరుగుతున్నాయని, ఒక్కో బస్సులో పది, పదిహేను మందికి మించి ప్రయాణికులుండటం లేదని సీఎం పేర్కొన్నారు. నష్టాల నేపథ్యంలో ఇలా నడపడం ఎందుకని ప్రశ్నించారు. దీంతో అధికారులు ఇక బస్సుల సంఖ్య తగ్గించటమే మేలని నిర్ణయించారు.

ఇలా చేస్తారు... 
►ప్రస్తుతం కాలం చెల్లిన 600 బస్సులను ఈ ఖాతాలో తగ్గించేస్తారు. 
►500 మంది వరకు డ్రైవర్ల కొరత ఉంది. దీంతో కొన్ని సర్వీసులు డిపోల కే పరిమితమవుతున్నాయి. ఆ మేరకు సర్వీసులకు కోత పెడతారు.  
ఇలా చేయొచ్చు... 
►బస్సుల సంఖ్య తగ్గించటం కంటే ఉన్నవాటిని హేతుబద్ధీకరించాలి. మధ్యాహ్నం వేళ చాలా ప్రాంతాలకు రద్దీ తక్కువగా ఉంటున్నందున ఆ సమయాల్లో కొన్ని బస్సులను కొత్త ప్రాంతాలకు తిప్పాలి.  
►ఓఆర్‌ఆర్‌ వరకు సిటీ విస్త రించినందున ఆ ప్రాంతాన్ని దాటి సమీపంలోని కొత్త ప్రాం తాలకు ఆ బస్సులు నడపాలి. దీంతో ఆదాయం పెరగొచ్చు.   
►ఉదయం, రాత్రి రద్దీ వేళల్లో ఉన్న బస్సులే సరిపోవడంలే దు. బస్సుల సంఖ్య తగ్గిస్తే ఆ సమయాల్లో ఇబ్బంది తప్పదు.

సిబ్బందినేం చేస్తారు?: ప్రస్తుతం ఆర్టీసీలో బస్సులు–సిబ్బంది దామాషా 1:6గా ఉంది. వేయి బస్సులు తగ్గిస్తే 6వేల మంది సిబ్బందిని తగ్గించాలి. ఇలా మిగిలే సిబ్బందిని ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్న. పైగా, ఆర్టీసీ మొత్తం వ్యయంలో 58 శాతం సిబ్బంది జీతాల రూపేణా ఖర్చవుతోంది. నష్టాలు తగ్గించేందుకు బస్సుల సంఖ్య తగ్గించినా, సిబ్బంది అలాగే ఉంటారు కదా. వారి జీతాలు తగ్గవన్న విషయం గుర్తించలేదా?. చార్జీలతో ఆదాయం పెరిగింది: ఇటీవల పెంచిన చార్జీలతో నగరంలో ఆర్టీసీకి దాదాపు 25 శాతం మేర ఆదాయం పెరిగింది. బస్సు పాస్‌ల ధరల పెంపుతో, ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్‌మెంట్‌ మొత్తం కూడా పెరుగుతుంది. ఉన్న బస్సులను రేషనలైజ్‌ చేస్తే కొంత ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రెండు విషయాలను క్రోడీకరించుకునే కసరత్తు చేస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌: జనాభా దాదాపు కోటి 
ఆర్టీసీ బస్సులు: 3,700 
పరిస్థితి: రాత్రి 9 తర్వాత బస్సులు చాలా పలచగా తిరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఆరు తర్వాత గానీ రోడ్లపై ఎక్కువగా కనిపించవు. 
సిఫారసు: ఉన్నఫళంగా వేయి బస్సులు పెంచాలని గతేడాది ఆర్టీసీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచించింది.
బెంగళూరు: జనాభా దాదాపు కోటి 
సిటీ బస్సులు: 6,500 
పరిస్థితి: ఉదయం నాలుగు నుంచి రాత్రి 12 వరకు బస్సులు అందుబాటులో ఉండటమే కాకుండా, అంతర్గత కాలనీలకు కూడా నడుస్తున్నాయి. 
ప్రత్యేకత: దేశంలో ఢిల్లీ తర్వాత అన్ని ఏసీ బస్సులున్న నగరం ఇదే. ఏకంగా ప్రభుత్వమే సొంత నిధులతో గతంలో వేయి ఏసీ బస్సులు అందుబాటులో ఉంచింది. సిటీ కోసం ప్రత్యేకంగా ఉన్న కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మరిన్ని బస్సులు సమకూరబోతున్నాయి.

ఆర్టీసీలో 359 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 359 మంది సిబ్బందిని క్రమబద్ధీకరిస్తూ ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆర్టీసీ లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం రెగ్యులరైజ్‌ అయినట్టయింది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్‌ కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎండీని ఆదేశించడంతో శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 296 మంది డ్రైవర్లు కాగా, మిగతా వారు కండక్టర్లు. నిజానికి వీరు 2015లోనే రెగ్యులరైజ్‌ కావాల్సి ఉంది. ఆ సమ యంలో వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిమాండ్‌ను కూడా ప్రభుత్వం ముందుంచారు.

దానికి సమ్మతిస్తూ అప్పట్లో కార్మిక సంఘాలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు 4,400 మందిని క్రమబద్ధీకరించారు. కానీ శాఖా పరమైన చర్యలకు గురైనవారు, ఇతర లోటుపాట్లు ఉన్నవారు మిగిలిపోయారు. అప్పటి నుంచి తమను కూడా రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ వస్తున్నారు. ఇటీవల సమ్మె నేపథ్యంలో సీఎం ప్రకటించి న వరాల్లో భాగంగా వీరికి కూడా అవకాశం లభించింది. 240 పనిదినాల అనుభవం ఉండటాన్ని అర్హతగా నిర్ధారించారు. వీరిలో చాలామంది ఐదారేళ్లుగా పనిచేస్తున్న వారుండటంతో దాదాపు అంతా దానికి అర్హత సాధించే అవకాశం ఉంది. ఎవరికైనా అన్ని పని దినాల అనుభవం లేకుంటే, వారు పని దినాలు పూర్తి చేసుకోగానే రెగ్యులరైజ్‌ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో ఎండీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు