గాంధీలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మృతి

14 Nov, 2018 02:36 IST|Sakshi

తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో గత రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు స్వైన్‌ఫ్లూతో మృతి చెందారు. ఆస్పత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట బొల్లారంకు చెందిన మహిళ (46) ఈ నెల 8న గాంధీ ఆస్పత్రిలో చేరింది. వైద్య నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ అని వెల్లడైంది. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం (13న) ఉదయం మృతి చెందింది. హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌కు చెందిన వృద్ధుడు (67) మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై ఈ నెల 9న గాంధీ ఆస్పత్రిలో చేరాడు.

స్వైన్‌ఫ్లూ చికిత్స పొందుతూ ఈ నెల 12న కన్ను మూశాడు. దీంతో ఈ ఏడాది గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ వల్ల మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రంగారెడ్డి జిల్లా బాలానగర్‌కు చెందిన మహిళ (48), హైదరాబాద్‌ చంపాపేట సంతోష్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి, మంచిర్యాల బెల్లంపల్లి లంబాడీ తండాకు చెందిన మహిళ (41)లు స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఆరుగురు అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  

39 మందిలో 9 మంది మృతి.. 
గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ మందులు ఇతర వసతులు ఉన్నాయని, మృతులకు స్వైన్‌ఫ్లూ, ఇతర రుగ్మతలు ఉండటంతోపాటు, చివరి క్షణాల్లో రిఫరల్‌పై ఇక్కడకు వచ్చారని, మెరుగైన వైద్యసేవలు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గాంధీ ఆస్పత్రిలో 39 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా 27 మంది సురక్షితంగా డిశ్చార్జ్‌ అయ్యారని, 9 మంది మృతిచెందారని వెల్లడించారు. మరో ముగ్గురుకి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు