అనుమతిలేని బయోమందుల పట్టివేత

30 Aug, 2018 14:13 IST|Sakshi
బయోమందులను పట్టుకున్న ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్‌ అసోసియేషన్‌ నాయకులు  

నల్లబెల్లి : అనుమతిలేని బయోమందులు, త్రీజీ గుళికలు టాటా ఏసీ వాహనంలో తిరుగుతూ రైతులకు అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో నల్లబెల్లి ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్‌ అసోసియేషన్‌ నాయకులు, రైతులు వాహనాన్ని పట్టుకొని వ్యవసాయాధికారులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని మామిండ్లవీరయ్యపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకొంది. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు గొనే వీరస్వామి, ప్రధాన కార్యదర్శి మచ్చిక రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బయో ఫర్టిలైజర్‌కు సంబందించిన గోల్డెన్‌ త్రీజీ గుళికలు, వేపపిండి బస్తాలను టాటా ఏస్‌ వాహనంలో ఓ వ్యాపారి తీసుకువచ్చి రైతులకు అక్రమంగా అంటగడుతున్నాడు.

ఈ మందులను మండలంలోని మామిండ్లవీరయ్యపల్లి, నాగరాజుపల్లి గ్రామాలలో రైతులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో నల్లబెల్లి ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్‌ అసోసియేషన్‌ నాయకులు మామిండ్లపల్లి గ్రామానికి చేరుకొని బయోమందుల విక్రయాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా గ్రామాలలో బయోమందులు ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు వ్యవసాయాధికారి పరమేశ్వర్‌కు సమాచారాన్ని అందించారు. దీంతో గ్రామానికి చేరుకొన్న వ్యవసాయాధికారి వ్యాపారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయోమందులతో పాటు టాటా ఏస్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. గ్రామాలలో తిరుగుతూ బయోమందులు రైతులకు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు