మహిళల నెత్తిన వడ్డీ రాయితీ

17 Nov, 2014 03:59 IST|Sakshi
మహిళల నెత్తిన వడ్డీ రాయితీ

డ్వాక్రా మహిళా సంఘాలకు గతంలో రూ.5 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. కానీ ఇకనుంచి మేం వడ్డీ లేకుండా రూ.10లక్షల వరకు రుణాలు అందిస్తాం. అంతేకాకుండా గతంలో ఉన్న వడ్డీ బకారుులు సైతం వచ్చే నెల మొదటి వారంలో చెల్లిస్తాం’’
 - ఇది మంత్రి హరీష్‌రావు శనివారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో చెప్పిన మాట.
 
 మా సంఘం తరఫున ఈఏడు మార్చిలో రూ.5లక్షలు బ్యాంకు నుంచి అప్పుగా తెచ్చుకున్నం. నెలనెలా వడ్డీ రాయితీ ఇస్తామని సర్కార్ చెప్పింది. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. బ్యాంకువారు ఇప్పటికే రూ.50వేల దాకా వడ్డీ వసూలు చేసిండ్లు. మాకు లోన్ ఇచ్చి ఏం లాభం’’
 - ఇది మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ప్రగతి మహిళా సంఘం సభ్యుల ఆవేదన.
 
 మేడిపెల్లి: మహిళల ఆర్థిక స్వావలంబనలో భాగంగా గత ప్రభుత్వాలు పావలా వడ్డీ, వడ్డీలేని రుణం పథకాలను ప్రవేశపెట్టారుు. దీంతో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా బ్యాంకుల నుంచి రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం వాటికి నెలనెలా వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉంది.

ఆ మొత్తాన్ని సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయూలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం మొదలు ఇప్పటివరకు మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించలేదు. తమ నుంచి బ్యాంకర్లు వడ్డీ వసూలు చేస్తుండడంతో అదనపు భారం పడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 బడ్జెట్ లేదట
 జిల్లాలో మొత్తం 46,738 మహిళా సంఘాలుండగా ఇందులో 45,144 సంఘాలు వివిధ బ్యాంకుల నుంచి రూ.570.31 కోట్ల రుణాలు తీసుకున్నారుు. వీరు తీసుకున్న రుణాలకు ప్రతీ నెల ప్రభుత్వం నుంచి సుమారుగా రూ.2.5 కోట్ల వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు రూ.22.62 కోట్ల వడ్డీ రాయితీ ఇంతవరకు రాలేదు.

బడ్జెట్ లేదనే సాకుతో ప్రభుత్వం తొమ్మిది నెలలుగా వడ్డీ చెల్లించడం లేదు. దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు పావలావడ్డీకి రుణాలు ఇవ్వగా, అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ వడ్డీలేని రుణాలు అందజేసింది. అటు తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ అందజేయలేదు.

 వారి నిబంధనలు వారివే...
 మహిళా సంఘాలన్నింటికి వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలు ఇస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ వాస్తవంలో బ్యాంకులు తమ నిబంధనల ప్రకారమే వడ్డీ వసూలు చేస్తున్నారుు. ఒక్కో మహిళా సంఘం రూ.3లక్షల లోపు(రూ.లక్ష నుంచి రూ.3 లక్షల లోపు) రుణం పొందితే రూ.0.50 వడ్డీ పడుతోంది.

అలాకాకుండా రూ.3లక్షలకు పైగా(రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు) రుణం తీసుకుంటే రూ.1.25 వడ్డీ పడుతోంది. ఈ విషయంలో మహిళా సంఘాలు ఎంత మొత్తుకున్నా వారి మాట బ్యాంకర్లు వినడం లేదు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న వడ్డీని త్వరగా చెల్లించాలని, రూ.3లక్షలకుపైగా రుణాలు తీసుకున్న సంఘాలకు అదనపు వడ్డీరేటును తగ్గించాలని మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
 
 46,738
 జిల్లాలో మహిళా సంఘాలు    
 45,144
 రుణం తీసుకున్న సంఘాలు
 రూ.570.31 కోట్లు
 తీసుకున్న రుణం మొత్తం
 
 నెల            రావాల్సిన వడ్డీ
             (రూ.కోట్లలో)
 మార్చి        2.50
 ఏప్రిల్        2.70
 మే            2.44
 జూన్        2.55
 జూలై        2.76
 ఆగస్టు        2.01
 సెప్టెంబర్        2.66
 అక్టోబర్        2.50
 నవంబర్        2.50
 మొత్తం        22.62

మరిన్ని వార్తలు