వినియోగదారుల సమస్యలు తీర్చే కొత్త యాప్!

29 Sep, 2015 19:00 IST|Sakshi
వినియోగదారుల సమస్యలు తీర్చే కొత్త యాప్!

సెల్ ఫోన్ బుక్ చేస్తే... కీ చైన్ రావడం..., ఓ కంపెనీ ప్రొడక్టు బుక్ చేస్తే మరో కంపెనీది రావడం ఇలా తరచుగా మనం ఆన్ లైన్ షాపింగ్ ఇబ్బందులు చూస్తూనే ఉంటాం. బిజీ లైఫ్ లో వీకెండ్ షాపింగ్ కు సమయం వెచ్చించలేని వారు ఆన్ లైన్ షాపింగ్ పై ఆధారపడుతుంటారు. అత్యంత సులభం అనుకునే ఆన్ లైన్ షాపింగ్ ఒక్కోసారి కొనుగోలుదారులకు కష్టాలను కొని తెచ్చిపెడుతుంటుంది. అయితే  తాము బుక్ చేసిన ఉత్పత్తులు సరిపోలకుండా.. వచ్చినప్పుడు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఆ ఫిర్యాదులను అత్యంత త్వరగా పరిష్కరించేందుకు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో 'కన్జూమర్ కనెక్ట్' పేరున ఓ మొబైల్ యాప్ వచ్చింది. దీంతో  ఎప్పటికప్పుడు కస్టమర్ల సమస్య తీరే అవకాశం ఉంది.

 సత్యమూర్తి అనే యువకుడు తన ప్రయాణం కోసం ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీలో అరవై వేల రూపాయలతో ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. కానీ అత్యవసర పరిస్థితుల్లో అతని ప్రయాణం ఆగిపోయింది. దీంతో సత్యమూర్తి తన డబ్బు తిరిగి ఇవ్వమని కంపెనీకి ఫిర్యాదు చేశాడు. కంపెనీ నుంచీ కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే తిరిగి రావడంతో ఆశ్చర్యపోయిన అతడు...కన్జూమర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకున్నాడు. సమస్యను పరిశీలించిన సీ.ఏ.ఐ సత్యమూర్తికి ఫిర్యాదు విషయంలో సహాయపడింది. దీంతో 55 వేలు రిఫండ్ కూడ వచ్చాయి

'' ఇది పూర్తిగా కంపెనీల తప్పు కాదు, మనం కొనుగోలుదారులుగా తగిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్యను వెంటనే వినియోగదారుల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో తక్షణ సేవలు అందించేందుకు సీఏఐ అందుబాటులో ఉంది.'' అంటున్నారు  సీఏఐ సంస్థ ఫౌండర్ ట్రస్టీ కె. కృష్ణ కుమార్.

కష్టమర్ల  ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆయా కంపెనీలతో ఫాలోఅప్ చేసి సహాయం అందించేందుకు 2001 లో సీ.ఏ.ఐ ప్రారంభమైంది. సీ.ఏ.ఐ టీమ్ కేవలం ఒక్క నెల్లోనే కస్టమర్ల సమస్యను  తీర్చేందుకు కూడ సహాయ పడుతోంది. అక్కడితో ఆపకుండా ఇప్పుడు కస్టమర్లకు మరింత అందుబాటులో ఉండేందుకు సంస్థ కొత్తగా 'కన్జూమర్ కనెక్ట్'  పేరున మొబైల్ యాప్ విడుదల చేసింది. దీంతో కస్టమర్లు ఎవర్ని కలవాలి అన్న సందేహం లేకుండా ఎప్పటికప్పుడు తమ చేతిలో ఉండే యాప్ ద్వారానే ఫిర్యాదులు చేయొచ్చునని సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. మొబైల్ యాప్ తో కస్టమర్ స్వయంగా కంప్లైంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

మొత్తం సంస్థలోని పదకొండు మంది టీమ్... వచ్చిన కంప్లైంట్ లను మెయిల్స్ ద్వారా ఆయా కంపెనీలతో ప్రదించి పరిష్కరానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా నెట్ వర్క్ అందుబాటులో లేని సమయంలో కూడ అప్లికేషన్ పూర్తి చేసే అవకాశం ఈ యాప్ లో ఉంది. పూర్తిచేసి సిద్ధంగా ఉంచిన ఫిర్యాదును నెట్ వర్క్ ద్వారా పంపించవచ్చు.

 

తాము అందుకున్న ఉత్పత్తుల ఫొటోలను కూడా తీసి కూడ యాప్ ద్వారా పంపించవచ్చు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు కస్టమర్లు వార్షిక రిజిస్ట్రేషన్ ఫీజు కడితే సరిపోతుంది. త్వరలో సంస్థ వినియోగదారులకు అదనంగా సహాయం అందించేందుకు కన్జూమర్ ఇంటర్నేషనల్, కన్జూమర్ వరల్డ్ ఫెడరేషన్ గ్రూపులతో సంప్రదించి తమ సేవలను మరింత విస్తరించనుంది.

మరిన్ని వార్తలు