భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్న కేసులో సీబీఐ ఓ పెద్ద చేపను పట్టింది. ముంబై ఆదాయపన్ను శాఖలో అప్పీళ్ల విభాగంలో కమిషనర్గా పనిచేస్తున్న బీబీ రాజేంద్ర ప్రసాద్ సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసింది. ఓ బడా కార్పొరేట్ సంస్థకు మేలు చేసేందుకు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటున్నట్లు కచ్చితమైన సమాచారం రావడంతో ఆయన కార్యాలయం మీద దాడి చేసిన సీబీఐ అధికారులు.. రాజేంద్ర ప్రసాద్తో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి మొత్తం దాదాపు రూ. 1.5 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం డీల్ ఇంతకంటే చాలా ఎక్కువగా ఉందని, దొరికింది మొత్తం సొమ్ములో కొంతేనని అంటున్నారు. లంచాల కేసులను సీబీఐ పట్టుకోవడం కొత్తేమీ కాదు గానీ, ఇంత పెద్ద మొత్తంలో.. అది కూడా ఆదాయపన్ను శాఖ అధికారినే పట్టుకోవడం మాత్రం విశేషమే అంటున్నారు.