న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల మీద లోక్సభలో వాడీవేడిగా చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాయిగా నిద్రలోకి జారుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు చర్చతో, వాగ్వాదాలతో సభ అట్టుడుకుతుండగా.. రాహుల్ మాత్రం నిద్రలో ఆపసోపాలు పడటం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది.
లోక్సభలోనే రాహుల్ కునుకు తీయడంపై ప్రత్యర్థి బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. యూపీఏ సర్కారు అధికారంలో ఉన్న గత పదేళ్లూ పడుకొని ఉన్న రాహుల్కు ఇంకా నిద్రసరిపోలేదా అంటూ సెటైర్లు విసిరింది. మరోవైపు ఈ విషయంలో తమ యువనేతను ఎలా సమర్థించుకోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ నేతలు మథనపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ స్పందించారు. రాహుల్ గాంధీ దేశం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, ఆ అలసట నుంచి పార్లమెంటులో ఆయన కాస్తా రిలాక్స్ అయ్యారని, అంతదానికి రాహుల్ నిద్రపోయారని పేర్కొనడం సరికాదని ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. రాహుల్ రిలాక్స్ అయ్యారు కానీ, నిద్రపోలేదని ఆయన చెప్పుకొచ్చారు.